Tuesday, May 1, 2018

మా పాలేరు అసెంబ్లీ ప్రాంత రాజకీయాలు---1978 తర్వాత...

44. (NKP-5). 

నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవిర్భావం.

1978 సం.లో ఆంధ్ర ప్రదేశ్ రాష్రంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో అప్పుడు ఇందిరా కాంగ్రెస్ పార్టీ  శ్రీ కీసర అనంత రెడ్డి గారి నాయకత్వం లో వుండేది. ఆయన తెలంగాణా ప్రాంతీయ బోర్డు చైర్మన్ గా కాబినెట్ ర్యాంక్ లో వుండేవారు.

1980 సం.లో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి ప్రతిపాదన మేరకు నేలకొండపల్లి Agricultural market committee ని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి విడగొట్టి ఏర్పాటు చేశారు.నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి మొట్టమొదటి ప్రెసిడెంట్ గా శ్రీ నాగుబండి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ వున్నం వెంకయ్య బాధ్యతల నిర్వహించారు.

క్రింది చిత్రం పాలక వర్గం అధికారిక పత్రాలు అందు కున్నప్పటిది.

చిత్రం లో కుడి నుండి వరుసగా సర్వశ్రీ వంగవీటి వెంకట సుబ్బయ్య, రామసహాయం  భువన సుందర్ రెడ్డి,కొమ్మినేని అనంత రామయ్య,కొత్త యోగానంద రావు, పెండ్యాల సత్యనారాయణ రావు, నాగుబండి సత్యనారాయణ,వున్నం వెంకయ్య, నాగళ్ల భద్రయ్య, ఎల్లంపల్లి రామచంద్రయ్య, సోమ్ల నాయక్, కిలారు వెంకయ్య,పెండ్యాల భగవాన్లు, నాగుబండి లక్ష్మినారాయణ వున్నారు.


నేలకొండపల్లి ప్రధమ వ్యవసాయమార్కెట్ కమిటీకి చైర్మన్ గా శ్రీ కొమ్మినేని అనంతరామయ్య, శ్రీ కొత్త యోగానందరావులు పోటికి వచ్చారు. కాని శ్రీ నాగుబండి సత్యనారాయణ ప్రెసిడెంట్ అయ్యారు.మొదటి నుండీ శ్రీ నాగుబండి జలగం శిష్యులుగా వుండేవారు. 

అసంతృప్తి చెందిన నేలకొండపల్లి ఉపసర్పంచ్ శ్రీ యోగానంద రావు సర్పంచ్ పదవికై వడివడిగా అడుగులు వేసాడు.చివరి నిమిషంలో రంగం నుంచి ఆయన తప్పుకోవటంతో అనుకోకుండా శ్రీ కొత్త జనార్ధనరావు తెరపైకి వచ్చి 1981 సంవత్సరంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు పై పోటీ చేసాడు.

ఆ పిదప శ్రీ వంగవేటి వెంకటసుబ్బయ్య మధ్యవర్తిత్వంతో మండల కాంగ్రెసుకమిటీ ప్రెసిడెంటుగా శ్రీ కొత్త జనార్ధనరావును శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారు ఆమోదించటంతో పెండ్యాల సత్యనారాయణ రావు గారి మరణం వరకు ఆ వర్గమంతా ఆయనతోనే ఉన్నారు.

కొసమెరుపు ఏమిటంటే ఈ రాజీమార్గాల వల్ల మార్కెటు కమిటీ చైర్మన్ మరియు మండలకాంగ్రెస్ ప్రసిడెంట్ పదవులకు నేను దూరంగా వుండ వలసి వచ్చింది.

పాలేరు అసెంబ్లీ చరిత్ర.
1962 సం లో ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గం నుండి పాలేరు  అసెంబ్లీ నియజక వర్గం ఏర్పడిన దగ్గర నుండి అది షెడ్యూల్ కులాల రిజర్వేషన్స్ లోనే వుంది. 1962  నుండి 1978 దాకా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గా శ్రీ కతుల శాంతయ్య MLA గా ఎన్నికయ్యారు. 1978 సం. లో దేశంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నూతన పరిణామాలరీత్యా బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ లో శ్రీ కత్తులశాంతయ్య వుండి పోవటం వల్ల INDHIRA CONGRESS అభ్యర్ధిగా శ్రీ పొట్టి పింజార హుస్సేన్ పాలేరు MLA  గా ఎన్నిక అయినాడు. తరువాత అసెంబ్లీ ముఖ చిత్రం మారి పోయి కొత్త రాజ కీయ వాతా వరణం కు దోహదం చేసింది.

1981 సం.లో పాలేరు MLA శ్రీ పొట్టిపింజార హుస్సేన్ ఆకస్మిక మరణంతో జరిగిన ఉపఎన్నికలో సంభాని చంద్రశేఖర్ పాలేరు రాజకీయాల్లో అడుగుపెట్టాడు.రాష్ట్ర యువజకాంగ్రెస్ నాయకుడైన శ్రీ ఇంద్రసేనారెడ్డి ఇచ్చిన చేయూతతో సింగరేణి కాలరీస్ ఎంప్లాయ్ అయిన శ్రీ సంభాని అసెంబ్లీ రాజకీయాలలో అరంగ్రేటం చేసాడు.

పార్టీ టికెట్ రాంగానే ఖమ్మం హిల్ బంగ్లా(అధికార కేంద్రం--Road అండ్ Buildings Guest house) లో వున్న శ్రీ కీసర అనంతరెడ్డి గారికి ఆశీస్సుల కోసం పాదాభివంధనం చేయబోగా , ఆయన వారించి ప్రక్కనే కూర్చొని వున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారిని చూపించి ఆనియోజకవర్గం ఆయనది, ఆయన ఆశీస్సులు తీసుకొమ్మని సలహా ఇవ్వటం--శ్రీ సంభాని తీసు కోవటం జరిగి పోయాయి. చీఫ్ ఎలక్షన్ ఏజెంటుగా పెండ్యాల సత్యనారాయణ రావు గారే భాద్యతల తీసుకొని శ్రీ సంభానీని గెలిపించటం జరిగింది.

తరువాత సింగల్ గా జరిగిన రెండు (1983 మరియు 1985) అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ సంభాని చంద్రశేఖర్ ఓడిపోవటం తరువాత శ్రీ జలగం వెంగళరావు గారు లోకసభకు పోటీచేసినప్పుడు (1989), తరువాత శ్రీమతి రేణుకాచౌదరి లోకసభకు పోటీ చేసినప్పుడు (1999  మరియు 2004)  శ్రీ సంభాని చంద్రశేఖర్ ఎం.ఎల్.ఏ గా గెలవటం జరిగింది.

ఉపఎన్నికలో తప్ప అయన గెలిచింది లోకసభ ఎన్నికలతో బాటు జరిగిన అసెంబ్లి ఎన్నికలలోనే. విచిత్ర మేమిటంటే ఆయనతో బాటు  గెలిచిన లోక సభ సభ్యులు ఇద్దరినీ ఆయన తన రాజకీయ శత్రువులుగా భావించేవాడు. బ్రహ్మచారి అయిన శ్రీ చంద్రశేఖర్ విలక్షణవ్యక్తి. ఈ లక్షణమే ఆయన భవిష్యత్తును ప్రభావితం చేసింది. ఈయన రాజకీయాలలోకి వచ్చిన తరువాత పాలేరు, గట్టుసిగారం మొదలుకుని వల్లభి, నేలకొండపల్లి, మేడేపల్లి , ముదిగొండ మరియు కొన్ని ముఖ్య గ్రామాల  సీనియర్ నేతలంతా కొందఱు వ్రుద్ధ్యాప్యంవల్ల రాజకీయాలకు దూరంగా వుండటం, మరికొందరి మరణం వల్ల నియోజకవర్గంలో 1990 తరువాత కాంగ్రెసు పార్టీకి ఈయనే పెద్దదిక్కుగా మారాడు. ప్రత్నామ్యాయం లేకుండా పొయింది.

కాంగ్రెసుపార్టీ మొత్తం తన చెప్పుచేతలలోనే ఉండాలనే తన వ్యవహారశైలి వల్ల కాబినేటు  మంత్రిగా వుండికూడా తదుపరి ఎన్నికలలో(1994) ప్రజాగ్రహంతో ఓటమి చెందవలసి వచ్చింది.

శ్రీ సంభాని రాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశాక నేలకొండపల్లిలో జరిగిన సన్మాన కార్యక్రమం క్రింది చిత్రం.
పాలేరు శాసన సభ్యులలో ప్రప్రధమం గా మంత్రి పదవిని అలంకరించింది శ్రీ సంభాని చంద్రశేఖర్ కావటం గమనార్హం.

శ్రీ సంభాని చంద్రశేఖర్ రాష్ట్రమంత్రి అయిన సందర్బంగా జరిగిన సన్మానకార్యక్రమంలో ప్రసంగిస్తున్నది శ్రీ పెండ్యాల వాసుదేవరావు. చిత్రంలో కూర్చున్నవారు కుడి నుండి ఎడమకు వరుసగా సర్వశ్రీ డి.పురుషుత్తం, సంభాని చంద్రశేఖర్, కంకిపాటి జగన్మోహనరావు, కత్తుల శాంతయ్య, జాస్తి వెంకటేశ్వరరావు, ఎం.వి.రామారావు, నాగుబండి సత్యనారాయణ. నిలుచున్నవారిలో నాగుబండిలక్ష్మీనారాయణ, చట్టు వెంకటేశ్వర్లు, డి. సూరిబాబు ఇతరులు వున్నారు.


-----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>




tag

No comments:

CONTACT US.

 CONTACT US. "We love hearing from our readers! If you have any questions, suggestions, or just want to say hello, please feel free to ...