58. (ఖమ్మం చరిత్ర-6) మా వరంగల్/ఖమ్మం జిల్లాలో ప్రధమ ధశాబ్ధంన్నర ఎన్నికల రాజకీయం.

మా వరంగల్/ఖమ్మం జిల్లా లో ప్రధమ దశాబ్ధం ఎన్నికల రాజకీయం.

అది 1949 సంవత్సరం నవంబెర్ 26 వ తేది, వరంగల్ పట్టణంలో అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల సారధ్యం లో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  ఆ సమావేశానికి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నేత్రుత్త్వం వహించారు. సర్దార్ వల్లభాయి పటేల్ ముఖ్యఅతిధిగా వచ్చారు. విశాలాంధ్ర ఏర్పాటుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రజల మద్దతు సంపాదించటమే ఆ సమావేశ ముఖ్యోద్దేశ్యం. సహజం గానే హైదరాబాద్ లో సార్వత్రిక ఎన్నికలొస్తే ఎవ్వరు ముఖ్య మంత్రి అనే చర్చకూడా జరుగుతుంది. అంతర్గతంగా ఆ సమాలోచనలు కుడా జరిగాయి.

ఎన్నికలు జరుగుతే వరంగల్/ ఖమ్మం నుండి ముఖ్యమంత్రి కాండిడేట్ స్థాయి వున్న నాయకుడు కాంగ్రెస్ నుండి శ్రీ జమలాపురం కేశవరావు వున్నారు. కాంగ్రెస్ పార్టీ పై నిషేధం తొలగిన తరువాత ప్రప్రధమంగా శ్రీ జమలాపురం కేశవరావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1946-1949 వరకు పనిచేశారు. విశాలాంధ్ర భావనకు శ్రీ జమలాపురం వ్యతిరేకించాడు. పార్టీ లో ఒంటరి అయినాడు. అప్పుడే ఆయనను రాజకీయం గా అణగ దోక్కటానికి పావులు కదిపటం ప్రారంభం అయినది.

1949 హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలలో శ్రీ జమలాపురం కేశవరావు గారు ఓటమిచెందారు.

అప్పుడే వివిధ నాయకుల మధ్యన ముఖ్యమంత్రి పదవిపై ఆశలు మొగ్గ తొడిగినవి. ఎవ్వరి లాబియింగ్ లు వారు చాపక్రింద నీరులా ప్రారంభించారు. 1952 సంవత్సరం లో ప్రధమ సారస్వత ఎన్నికలు వచ్చేసరికి ఈ రాజకీయాలకు హైదరాబాద్ రాష్ట్రంలో ఒక  స్వరూపము సంతరించుకుంది.

శ్రీ జమలాపురం కేశవరావు గారికి ఆయన సొంత నియోజకవర్గం మధిర అసెంబ్లీ సీటు దక్కకుండా శక్తి వంచన లేకుండా కృషిచేశారు. వారిలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల హస్తాలున్నవి. కమ్మ్యునిస్ట్ ల కంచుకోట నర్సంపేట్ ఏరియాలోని పాకాల అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఆయనకు కేటాయించారు. వారు వుహించినట్లే ఆయన ఎన్నికలలో ఓడిపోయారు.
శ్రీ జమలాపురం కేశవరావు గారి అడ్డు తొలగబోతున్నదనే  సంకేతాలను అందుకున్న ఖమ్మం ఏరియా కాంగ్రెస్  నాయకులు హైదరాబాద్ రాష్ట్ర  ముఖ్య మంత్రి పదవి పై కన్నేశారు. విశాలాంధ్ర ఏర్పడితే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారే ముఖ్య మంత్రి అని అధిష్టానానికి లోగా వారు విన్న వించి ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీని వర్గాలు లేకుండా ఏనాడు వూహించ లేము. కాంగ్రెస్ పార్టీ పుట్టిన  వెంటనే అవి మొదలు అయ్యాయి. ఉదాహరణకు మహాత్మా గాంధి అభీస్టానికి వ్యతిరేకంగా శ్రీ నేతాజీ సుభాష్ బోస్ ను కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడి గా కాంగ్రెస్ఎ పార్టీ సభ్యులు ఎన్నుకొంటే, అధ్యక్షుడిగా గెలిచిన నేతాజీ సుభాష్చంద్ర బోస్  రాజీనామా చేసి పార్టీ నుండి బయటకు వెళ్ళేదాకా మహాత్మా గాంధీ ఊరుకోలేదు. అప్పుడు నేతాజీ పై ఆంధ్రాకు చెందిన శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోయారు.

ఆంద్ర రాష్ట్రం ఏర్పడటానికి ముందు నుండే ఆంధ్రా నాయకుల మధ్యన వర్గాలు ప్రారంభం అయ్యాయి. ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం ఏర్పడి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన తరువాత  మద్యపాన నిషేధం అమలును సాకుగా చూపి ప్రకాశం గారిని పదవి నుండి దించేశారు. అదే అదనుగా రెడ్డి సామాజిక వర్గమంతా అధికారం చేజిక్కిన్చుకోవటానికి పావులు కదిపారు. ఫలితంగా శ్రీ బెజవాడ గోపాలరెడ్డి ముఖ్య మంత్రిగా, శ్రీ నీలం సంజీవ రెడ్డి ఉప ముఖ్యమంత్రి గా అయ్యారు.

అక్కడ కులాల విభజన స్పష్టం గా కనబడుతుంది. అది మారిన ఆంధ్రా రాజకీయం.  

చరిత్ర గురించి మాట్లాడాలంటే కులాల గురించి మరియు వాటి ఉప కులాల గురించి కూడా చర్చించకుండా ఉండలేము. బ్రిటిష్ ఇండియాలో అయినా, ఆంధ్రాలో అయినా, హైదరాబాద్ రాష్ట్రంలో అయినా ఉద్యమాలలో అగ్ర వర్ణం వాళ్ళు, ముఖ్యం గా బ్రాహ్మిన్స్ అగ్ర భాగంలో వుండే వారు. వాళ్ళకున్న వేలాది ఎకరాల భూమిని, నెలవారీ వచ్చే వేలరూపాయల ఆదాయాన్ని త్రుణ ప్రాయం గా త్యాగం చేసి ఉద్యమాలు ప్రారంభించారు. బలహీన వర్గాలకోసం, అణగారిన ప్రజలకోసం ఉద్యమించారు.  నైజాంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు అగ్ర వర్ణ భూస్వాములే. ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ యే. వారు తమ ఆస్తి మొత్తాన్ని ఉద్యమంలో పోగొట్టుకున్నారు.

బ్రాహ్మిన్స్ లో వైదీకి, నియోగి ఫీలింగ్స్ ఎక్కువగా వున్న రోజులవి.  వరంగల్ జిల్లా విషయానికి వస్తే  కాంగ్రెస్ పార్టీ లో నియోగులే అగ్ర భాగాన వుండే వారు. వైదీకులు, నియోగులు మరియు కమ్మ సామాజిక వర్గం వారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో వుండేవారు.

1953 Decemberలో States Re organisation Committee ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫలితమ గా  విశాలాంధ్ర ఏర్పాటుకు భారత ప్రభుత్వం లో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపబోతున్నదనే విషయం స్పష్టం కాగానే ప్రభుత్వ ఏర్పాటుకు అటు ఆంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లోని వర్గాలు మరియు ఇటు హైదరాబాద్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ లోని వర్గాలు  అప్రమత్తం అయినాయి. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి పావులు కదిపినవి. ప్రధమమం లో పండిత జవహర్లాల్ విశాలాంధ్రకు వ్యతిరేకమైనా తరువాత ఆయనను ఒప్పించారు.

వరంగల్ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ లో శ్రీ జమలాపురం కేశవరావు ను అణగత్రొక్కే చర్యలు ముమ్మరం అయినై. ఆయన వ్యతిరేక వర్గం శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు ను ఆశ్రయించినవి. శ్రీ టంగుటూరి ప్రకాశం పంచన చేరాయి. ఆయనే ముఖ్య మంత్రి అని ప్రచారం లో పాల్గొన్నవి. పరోక్షంగా ఆ పదవి తమకే కావాలని ఆలోచన.  శ్రీ జమలాపురం ఉద్యమ పంధా మనిషే తప్ప రాజ్యాధికారం కోసం తపించే వ్యక్తి కాదు. ఈ మనస్తత్వాన్ని ఆసరాగా పావులు వేగంగా కదిపినవి ఆ వర్గాలు.

అటు ఆంద్ర రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రిగా వున్న నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్త రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తన రాజకీయ చదరంగపు ఎత్తులను  ప్రారంభించారు. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు వ్యతిరేక వర్గంను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేశారు.

శ్రీ కళా వెంకట్రావు మద్రాస్ ప్రెసిడెన్సీలో కాబినెట్ మినిస్టర్ గా సేవలందించిన వ్యక్తి. ఆంధ్రా కాంగ్రెస్ లో పెద్ద నాయకుడు.  ప్రత్యేక  ఆంధ్ర రాష్ట్ర  ఏర్పాటుకు మద్రాస్  రాష్ట్రం ఏర్పాటు చేసిన కమిటీ లో  కీలకమైన వ్యక్తి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీ గా సేవలందించిన వ్యక్తి. నైజాం వ్యతిరేక పోరాటం రోజులలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ నాయకులందరికీ విజయవాడ షెల్టర్ జోన్. కాంగ్రెస్ పార్టీ  నైజాం లో ఆవిర్భవించక ముందే ఆ పార్టీ పై  నైజాంలో నిషేధించినందువల్ల  కమ్యూనిస్ట్ లతో  కలిసి ఆంద్ర మహాసభ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ  నాయకులు పాలు గొనటం వల్ల ఇరు ప్రాంతాల నాయకులకు మంచి పరిచయాలు, సంభంధాలు ఉండేవి.

నైజాం విమోచనం తరువాత శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు కమ్యూనిస్ట్ పార్టీకి రాజీనామా చేసి స్వగ్రామానికి వచ్చిన తరువాత అప్పటి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ రామానంద తీర్ధ మరియు శ్రీ కళా వెంకటరావు ఆయనపై కాంగ్రెస్ పార్టీ లోకి రమ్మని వత్తిడి చేశారు. ఆయన సిద్ధాంత పరంగా నైజాం ఇండియాలో విలీనాన్ని వ్యతిరేకించిన కమ్యూనిస్ట్ పార్టీని విభేదిన్చాడే గాని పార్టీ పై ఆయనకు వ్యతిరేకత ఏమి లేదు. చాలా కాలం వరకు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు ఎటువంటి నిర్ణయము తీసుకోన లేదు. శ్రీ కళా వెంకట్రావు గారు నేలకొండపల్లి కి రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళారు. ఆ విధంగా వారి సంభంధాలు ఉండేవి. ఇక్కడి వారికి ఆయన ఎవ్వరో తెలియనందు వల్ల ఎవ్వరు గుర్తు పట్టే వాళ్ళు కాదు. ఈ సంభంధాలు తెలిసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు కొందరికి పెండ్యాల సత్యనారాయణ గారి పొడ గిట్టేది కాదు. జమలాపురం కేశవరావు గారితో పెండ్యాల సత్యనారాయణరావు గారికున్న ఆత్మీయ అనుభంధం వారికి తెలియనిది కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ లోకి వస్తే తమకు రాజకీయ ప్రత్యర్ధి అవుతాడని వారి భయం. కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆయన నాయకత్వ పటిమను చూసారు. జిల్లాలో "ఆయన పేరు చెబితే పిట్టలు కుడా నీళ్ళు తాగేవి కాదు అని పేరు. ఆయన పేరు చెబితే శత్రువులకు సింహ స్వప్నం". ఈ విషయం ఎన్నో సందర్భంలలో శ్రీ దాశరధి రంగాచార్య చెబుతుండేవారు.

చివరకు 1956 లో శ్రీ నీలం సంజీవరెడ్డి దూతగా శ్రీ కళా వెంకట్రావు గారు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారితో జరిపిన ఆంతరంగిక భేటీలో ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థుతుల బేరీజు వేసి జరిగిన నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల నిర్ణయం జరిగింది. అన్ని వర్గాలను కలుపుకుని పోయే విధం గా నిర్ణయం జరిగింది. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రప్రధమంగా జరిగిన ఎన్నికల అనంతరం శ్రీ కళా వెంకట్రావు గారు నీలం సంజీవరెడ్డి గారి మంత్రి వర్గంలో కాబినెట్ హోదాలో రాష్ట్ర రెవిన్యూ మరియు ఆర్ధిక శాకా మాత్యులు గా పనిచేశారు.

నైజాం వ్యతిరేక ఉద్యమం రోజులలో వరంగల్ జిల్లా ఆంద్ర మహాసభ అధ్యక్ష, కార్యదర్శులుగా కలిసి పనిచేసినందువల్ల శ్రీ జమలాపురం కేశవరావు గారికి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారికి  సత్సంభందాలు ఉండేవి. సహజంగానే కేశవరావు గారికి ఆప్తుడైనందున కేశవరావు గారి వ్యతిరేక  వర్గం వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శ్రీ సత్యనారాయణరావు పై రాజకీయ దాడికి పావులు కదిపారు. వాటి ఫలితాలె జిల్లా రాజకీయాలను ప్రభావితం చేశాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత 1957 లో జరిగిన సారస్వత ఎన్నికల ఎన్నికల అభ్యర్థుల ఎంపిక తదనంతర పరిణామాల ఫలితం గా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో నూతన నాయకత్వ ఆవిర్భావానికి హేతువు అయినవి.జిల్లా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

ఖమ్మం జిల్లా ఏర్పడిన నాటినుంచి జరిగిన పార్లమేంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ జిల్లా రాజకీయ పరిణామ క్రమాన్ని, ఆయా సమయాల్లో ప్రజల రాజకీయ భావాలను తేట తెల్లం చేస్తాయి.

మొదటి మూడు లోకసభ నియోజకవర్గం ఎన్నికలు.
ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో 1952 ఎన్నికలలో PDF పేరుతో పోటీచేసిన  కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ టి.బి.విట్టలరావు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గడియారం కృష్ణారెడ్డి పై 72.000 ఓట్ల తేడాతో గెలుపొందారు. సోషలిస్ట్ అభ్యర్ధి శ్రీ దేవులపల్లి రామానుజ రావు కు 16,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ  ఎన్నికలు హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినవి.

1957 ఎన్నికలలో ఖమ్మం లోకసభకు తిరిగి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ టి.బి.విట్టలరావు కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ కొలిపాక కిషన్ రావు  పై కేవల నాలుగు వేల నాలుగు వందల ఓట్లతో గెలుపొందాడు. ఖమ్మం జిల్లా ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎన్నికలు యివి.

1962 సంవత్సరం లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి  శ్రీమతి లక్ష్మికాంతమ్మ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ టి.బి.విట్టలరావు పై 17,000 ఓట్ల ఆధిక్యం తొ  గెలుపొందారు.

1964 లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ CPI, CPM లు గా విడిపోవటంతో తన ప్రాభవాన్ని తదుపరి ఎన్నికల రణరంగంలో చూప లేకపోయినవి. కాంగ్రెస్ అభ్యర్థులే వరుస విజయాలు సాధించారు.

అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల స్వరూపం.
అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే ఖమ్మం జిల్లా ఏర్పడనప్పుడు ఖమ్మం ప్రాంతంలో  1952 సంత్సరములో నాలుగు, 1957 లో ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండేవి. మొదటి రెండు ఎన్నికలలో ఖమ్మం మరియు ఎల్లందు అసెంబ్లీ నియోజక వర్గాలు ద్విసభ్య నియోజక వర్గాలుగావుండేవి (ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక OC, ఒక SC అభ్యర్థిని, ఎల్లందు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక OC, ఒక ST అభ్యర్థిని ఎన్నుకోవలసి వుండేది).  1962 లో అసెంబ్లీ ఏడు నియోజక వర్గాలు గా పెరిగినవి. 1978 నుండి తొమ్మిది నియోజక వర్గాలుగా మారినవి. 2009 లో అవి పది నియోజక వర్గాలయినవి.

మొదటి మూడు అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికలు.

 1952 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లలో కమ్యూనిస్ట్ అభ్యర్ధులే గెలిచారు. ఖమ్మంలో శ్రీ కర్నాటి కృష్ణయ్య, ఎల్లందులో శ్రీ కె. ఎల్. నరసింహారావు, మధిరలో  శ్రీ కొండబోలు వెంకయ్య, వేమ్సూర్ లో శ్రీ కందిమళ్ళ రామకృష్ణారావు (అశ్వారావ్ పేట బాబు) లు PDF పేరిట గెలుపొందారు. ఖమ్మం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన్ నాయకులంతా ఓటమి చెందారు. ఓటమి చెందిన వారిలో సర్వశ్రీ జమలాపురం కేశవరావు (ఈయన వరంగల్ ప్రాంతం పాకాలలో  పోటిచేశారు), మాడపాటి రామచంద్రరావు (మధిర అసెంబ్లీ---మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని ఏరియాలు కలిగిన నియోజక వర్గం), కొలిపాక కిషన్ రావు (ఖమ్మం అసెంబ్లీ---ప్రస్తుత పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజక ప్రాంతాలు), బొమ్మకంటి సత్యనారాయణరావు (వేమ్సూర్ అసెంబ్లీ --వైరా, తల్లాడ, కల్లూరు, లంకపల్లి, వేమ్సూర్ ప్రాంతాలు నియోజక వర్గంలో వున్నవి) ఉన్నారు.  

1957 అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ ముఖ చిత్రం మారింది. కాంగ్రెస్ఖ పార్టీ విజయధంకా మ్రోగించింది. ఖమ్మం OC స్థానం, మధిర, వేమ్సూర్, పాల్వొంచలలో కాంగ్రెస్ అభ్యర్థులు మరియు ఎల్లందు OC, ST స్థానాలు మరియు ఖమ్మం SC స్థానంలలో  కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు  గెలుపొందారు.

1962 అసెంబ్లీ ఎన్నికలో ఖమ్మం(శ్రీ నల్లమల గిరిప్రసాద్), పాల్వోంచ, బూర్గంపాడు మరియు ఎల్లందు(శ్రీ K.L.నరసింహారావు) నియోజక వర్గాలలో కమ్యూనిస్ట్ అభ్యర్ధులే గెలుపొందారు. మిగతా పాలేరు(S.C) శ్రీ కత్తుల శాంతయ్య, మధిర (శ్రీ దుగ్గినేని వెంకయ్య). వేంసూరు(శ్రీ జలగం వెంగళరావు) నియోజక వర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఖమ్మం నియోజక వర్గంలో కమ్యూనిస్ట్ అభ్యర్థి శ్రీ నల్లమల గిరిప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ పర్చా శ్రీనివాసరావు పై గెలుపొందారు.

మొదటి మూడు అసెంబ్లీ ఎన్నికలలో వరుస విజయాలను సాధించిన కమ్యూనిస్ట్ అభ్యర్థి శ్రీ K.L.నరసింహారావు మాత్రమే. అప్పటి వరకు వరుస విజయాలను నమోదు చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్దులుకుడా ఎవ్వరు లేరు.

1964 సంవత్సరంలో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ  CPI, CPM లుగా  చీలి పోవటం తొ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సమీకరణ లలో మార్పులు సంభవించాయి. 1967 మరియు ఆ తరువాత జరిగిన ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల చరిత్ర మహాభారతమంత వుంది. ఎత్తులు, పై ఎత్తులు రాజకీయ చదరంగాలే. సిద్ధాంత ప్రభావాలు ఏమీలేవు. 
క్రింద వున్న ఫోటో జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపన కార్య క్రమం. చిత్రం లో జిల్లా కాంగ్రెస్ నవ సారధులు వున్నారు. శంకుస్తాపనా కార్య క్రమాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డి చేశారు. మెడలో దండతో వున్న వారు శ్రీ సంజీవరెడ్డి. ఆయనకు కుడి వైపున శ్రీ జలగం వెంగళరావు, ఎడమవైపున శ్రీ శీలం సిద్దారెడ్డి వున్నారు. వెంగళ రావు గారికి కుడివేపునుండి వరుసగా సర్వశ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, J.V. నరసింగరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట పున్నయ్య, పెండ్యాల సత్యనారాయణరావు, గోగినేని సత్యనారాయణ, హీరాలాల్ మోరియా వున్నారు.
శ్రీ శీలం సిద్దారెడ్డి గారికి ఎడమ వయిపున సర్వశ్రీ జలగం కొండలరావు, ఎల్లంపల్లి రామచంద్రయ్య, లక్కినేని నరసయ్య, కొలిపాక కిషన్రావు  ఇతరులు వున్నారు.



మొదటి సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి వేమ్సూర్, ఖమ్మం మరియు మధిర అసెంబ్లీ నియోజక వర్గాలు ప్రత్యేకతను కలిగి వున్నాయి.  ఆ  నియోజక వర్గాల విశ్లేషణ వచ్చే వ్యాసం లో..

                  .......PENDYALA VASUDEVARAO.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?