Posts

Showing posts from September, 2018

59. (ఖమ్మం చరిత్ర-7) ఆ నాటి మా ఖమ్మం....ఒక కురుక్షేత్రం..

Image
ఆనాటి మా ఖమ్మం .... ఒక కురుక్షేత్రం. ఖమ్మం జిల్లా ఎన్నికల చరిత్ర ప్రముఖం గా ఖమ్మం, వేమ్సూర్ మరియు మధిర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర తో ముడిపడి వుంది. ఖమ్మంజిల్లా చరిత్ర ప్రస్తావనలో ఖమ్మం నాయకుల గురించి చెప్పుకోవలసి వస్తే శ్రీబొమ్మకంటి సత్యనారాయణరావు, పెండ్యాల సత్యనారాయణరావు, శ్రీ జలగం వెంగళరావు మరియు శీలం సిద్దారెడ్డి  పేర్లు ప్రముఖంగా వస్తాయి. 1949 సంవత్సరం నైజాం ప్రాంతంలో కీలకమైనవి. ఈ ప్రాంతంలో ముఖ్యమైన కమ్యునిస్టు పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాల్లో మార్పులు సంభవించాయి. వరంగల్ జిల్లాలో కుడా ఈ రెండు పార్టీల నాయకత్వాలు మారిపోయాయి. ఈ రెండు పార్టీల జిల్లా మరియు రాష్ట్ర పార్టీల నాయకత్వంలో ఖమ్మం నాయకులే వుండటం గమనార్హం. వాటి ఫలితమే 1952 ఎన్నికల నుండి జరిగిన రాజకీయ పునరేకీకరణలు. విశాలాంధ్ర సిద్ధాంతంను(ఆంధ్ర మరియు తెలంగాణా ప్రాంతాల విలీనం—భాషా ప్రయుక్త రాష్ట్రాలు) వ్యతిరేకించిన వారు కాంగ్రెస్ పార్టీ లో ఒంటరి వారు కావటం, నైజాం సంస్థానం ఇండియాలో విలీనం కావటాన్ని కమ్యునిస్టు పార్టీ వ్యతిరేకించిన కారణంగా ఆ పార్టీ నుండి కొందరు పార్టీ వీడిపోవటంతో ఈ మార్పులు సంభవించాయి.