G-1M93C8YK91 LIBERTY.: 2018

Thursday, December 13, 2018

ఆ నాటి మా ఖమ్మం లో మారిన రాజకీయ ముఖ చిత్రం.

61. (ఖమ్మం చరిత్ర-9) 

ఆ నాటి మా ఖమ్మం లో మారిన రాజకీయ ముఖ చిత్రం.

విబేధాలతో  వామపక్షాలు ---
ఆధిపత్య రాజకీయాలతో కాంగ్రెస్ వాదులు .....

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య జిల్లా నాయకుల చీలిక మరియు జిల్లా కమ్మ్యునిస్ట్ నాయకులలో కూడా  చీలికల్లో చీలిక రావడం ఖమ్మం జిల్లా రాజకీయ అవనికపై సరికొత్త సమీకరణాలకు దారి చూపాయి.

కాంగ్రెస్ పార్టీ లో జిల్లా నాయకుల చీలికలు. 
1967 అసెంబ్లీ ఎన్నికల వరకు కలిసేవున్నజిల్లా కాంగ్రెస్ నాయకులు ఆధిపత్య పోరాటంలో ఒకరికి ఒకరు ధూరం అయ్య్హారు. ఫలితంగా శ్రీ జలగం వెంగళరావు మరియు శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గాలుగా కాంగ్రెస్ శ్రేణులు చీలిపోయినవి. వైవిధ్య రాజకీయ నేపధ్యాలతో అనుహ్యంగా  ఏకమైన వారు ఆధిపత్య పోరాటంలో విడిపోవటంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం కొత్త రూపును సంతరించుకొంది. రాజకీయ సమీకరణలు మళ్ళీ మారిపోయాయి.

శ్రీ జలగం వెంగళరావు, శ్రీ శీలం సిద్దారెడ్డి రాజకీయ ప్రారంభంలో ఒకేవేధిక మీదకు వచ్చిన నాడే ఆధిపత్య ధోరణులకు అంకురార్పణ జరిగింది. ఆ విషయం జిల్లా కాంగ్రెస్ ఆఫీసు నూతన భవన నామకరణం దగ్గర బహిర్గతం అయినది. శ్రీ జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్ష బాధ్యతలు  చేపట్టినప్పుడు  శ్రీ శీలం సిద్దారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. జిల్లా పార్టీ ఆఫీసు భవన నిర్మాణానికి నిధుల సేకరణ మొదలైన కార్యక్రమాల నిర్వహణకై ఒక సన్నాహక కమిటిని ఏర్పరచారు. ఆ కమిటీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు భవనానికి “లాల్ బహాధూర్ శాస్త్రి“ పేరు పెట్టాలని నిర్ణయం జరిగింది. కానీ అనుహ్యంగా శ్రీ శీలం సిద్దారెడ్డి ఆఫీసు భవనానికి నీలం సంజీవరెడ్డి కి గుర్తుగా “సంజీవరెడ్డి భవనము” అని పేరు పెట్టాలని ప్రతిపాదనను ప్రవేశపెట్టాడు. అప్పుడు శ్రీ శీలం సిద్దారెడ్డి యం.ఎల్.సి. శ్రీ వెంగళరావు యిరకాటంలో పడిపోయాడు. ఇదివరకు అనుకున్న లాల్ బహదూర్ శాస్త్రి పేరుకు  భిన్నంగా  ‘సంజీవరెడ్డి భవనము ” అనే పేరును  శ్రీ వెంగళరావు సమర్ధించక తప్పలేదు. అదే పేరు ఖాయం అయినది. అలాగే శ్రీ సిద్దారెడ్డి స్వగ్రామం బనిగండ్లపాడు గ్రామంలో అంతకుముందు అనుకున్న పేరుకు భిన్నంగా ఆ గ్రామ స్కూల్ కు శ్రీ నీలం సంజీవరెడ్డి పేరును పెట్టక తప్పని పరిస్థితిని శ్రీ వెంగళరావు తీసుకుని వచ్చాడు. ఆ ఇద్దరు నాయకుల మధ్యన ఆధిపత్య ధోరణులు అలా ప్రారంభం అయినవి. 

బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించాక రాష్ట్రమంత్రి వర్గంలో శ్రీ శీలం సిద్దారెడ్డికి అవకాశాన్ని ఇవ్వటం జరిగింది. అప్పటికే యం.ఎల్.ఏ.గా వున్న వెంగళరావుకు ఆ విషయం మింగుడు పడలేదు. అప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గందే పైచేయిగ వుంది. పూర్తి స్థాయి ఆధిపత్యం వారిదే అంటే న్యాయంగా వుంటుంది. రాజకీయ సమీకరణాల రీత్యా శ్రీ శీలం సిద్దారెడ్డిని మంత్రివర్గం లోనికి తీసుకొనటంలో ఆశ్చర్యము ఏమీలేదు. ఆ సమయంలో శ్రీ జలగం వెంగళరావు తాను యం.యల్.ఎ గా, తన తమ్ముడు శ్రీ జలగం కొండలరావు జిల్లా పరిషద్ అధ్యక్షుడుగా వున్నారు. అధిష్టానం ఆయన శైలిని గమనిస్తూనే వుంది. ఆ స్వేచ్చని ఆయనకు వదిలేసి రాష్ట్ర స్థాయిలో శ్రీ సిద్దారెడ్డి ఎదుగులకు మార్గం వేశారు.

1952 సార్వత్రికలలో అదికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి పార్టీ అభ్యర్థులు ఓడిపోవటానికి కారణమైనందుకు కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీ జలగం వెంగళరావు మరియు శ్రీ శీలం సిద్దారెడ్డి లు ఇద్దరు ఆరు సంవత్సరాలు బహిష్కృతులు అయినారు. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుతో వున్న విబేదాలవల్ల ఆయనపై వేమ్సూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పొటీచేసి కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించబడిన నేపధ్యం శ్రీ వెంగళరావు గారిది. శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారి ప్రోద్బలంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీ మాడపాటి రామచంద్ర రావు గారి ఓటమికి బహిరంగ ప్రచారము చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించ బడిన నేపధ్యం శ్రీ శీలం సిద్దారెడ్డిది. 1952 సార్వత్రిక ఎన్నికల తరువాత శ్రీ వెంగళరావు గారికి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారితో ఆత్మీయ అనుబంధం ఏర్పడటం, అలాగే ఖమ్మంలో న్యాయవాద వృత్తిలో వుండి లా విద్యాభ్యాసంలో తన క్లాస్ మేట్ అయిన శ్రీ పెండ్యాల కృష్ణమూర్తి ద్వారా శ్రీ శీలం సిద్దారెడ్డి గారు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు చెంతకు రావటం జరిగింది. అలా ముగ్గురు కలయిక జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమ్ ఏర్పడ్డాక శ్రీ కొండా వెంకట రంగారెడ్డి గారు శ్రీ శీలం సిద్దారెడ్డిని రాజకీయంగా విస్మరించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త రాజకీయ సమీకరణాలరీత్యా ఖమ్మంజిల్లా రాజకీయాలతో ఆయనకు శ్రీ శీలం సిద్దారెడ్డితో అవుసరంలేక పోయింది. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారి చాణక్యంతో, శ్రీ కళా వెంకట్రావు గారి మార్గదర్శకత్వంతో శ్రీ నీలం సంజీవరెడ్డి రాజకీయ ప్రవాహంలో కలిసిన శ్రీ జలగం వెంగళరావు మరియు శ్రీ శీలం సిద్దారెడ్డిలు రాజకీయ నిచ్చెన నెక్కి శిఖరాల అధిరోహించారు.  

1967 అసెంబ్లీ ఎన్నికలలో యం.ఎల్.ఏ గా గెలిచియున్నా తనకు కాకుండా శ్రీ సిద్దారెడ్డి ని రాష్ట్ర కేబినెట్ లో కాబినెట్ మంత్రిగా తీసుకోవటం అవమానంగా భావించిన శ్రీ జలగం వెంగళరావు తన రాజకీయ భవిష్యత్తుకు రాజకీయ చదరంగం మొదలెట్టారు. ఆనాటి రాజకీయ అవుసరాలు మారి రాబోయే భవిష్యత్ కు ప్రత్యామ్నాయ పునాదులను వేయవసిన, వేసుకోవలసిన పరిస్థితి తనదని భావించాడు శ్రీ జలగం వెంగళరావు. రాజకీయంగా శ్రీ జలగం వెంగళరావుది ఒంటరికులం కావటంతో తన రాజకీయ సుస్థిరతకు చదరంగపావులు సొంతంగా కదపటం ఆ ప్రయత్నాలకు అంకురార్పణం చేయటం జరిగింది. శ్రీ శీలం సిద్దారెడ్డి రాష్ట్ర మంత్రి కావటంతో తన రాజకీయ ప్రత్యర్ధులు  ఎవ్వరో బేరీజు వేసుకుని వారికి చెక్ పెట్టె కార్యక్రమాలను తీవ్రతరం చేశారు శ్రీ జలగం వెంగళరావు. ఖమ్మం తాలుకా పై ద్రుష్టి పెట్టి ఆ నాయకులెవ్వరు జిల్లాను శాసించే స్థితిలో వుండకూడదు అనే నిర్ణయం తీసున్న ఆయన ఆ మార్గంను నిర్దేశించుకున్నాడు. శ్రీ శీలం సిద్దారెడ్డికి రాష్ట్ర స్థాయిలో దొరుకుతున్న ఆదరణకు జిల్లాలో తన స్థానం సొంతంగా నిర్మించుకోవటమే తన ఉన్నతికి తోడ్పడుతుందని భావించాడు.

ఖమ్మం కమ్యునిస్ట్ పార్టీలో మరియు  నాయకుల్లో చీలికలు.

మొదటి చీలిక.

1964 సంవత్సరంలో అంతర్జాతీయ రాజకీయాలలో వచ్చిన మార్పుల కారణంగా జాతీయ స్థాయిలో భారత కమ్యునిస్ట్ పార్టీ సి.పి.యం మరియు సి.పి.ఐ పార్టీ లుగా విడిపోవటంతో ఆప్రభావం ఖమ్మం జిల్లా కమ్యునిస్ట్ పార్టీ రాజకీయాలపై కూడా ప్రసరించింది. తొంభై శాతం ఖమ్మం జిల్లా కమ్యునిస్ట్ నాయకులు కార్యకర్తలు సి.పి.యం పార్టీ వేపే మొగ్గు చూపారు. సి.పి.ఐ పార్టీ నామ మాత్రంగానే మిగిలినధి. 1964, ఏప్రిల్ 16 & 17 తేదీలలో తనికెళ్ళ గ్రామంలో జరిగిన జిల్లా కమ్యునిస్ట్ సమితి సమావేశంలో అప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యునిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గా వున్న శ్రీ నల్లమల గిరిప్రసాద్ సి.పి.ఐ. సమర్దన వాదాన్ని వినిపించటాన్ని మెజారిటీ జిల్లా సభ్యులు విబేధించారు. కొక్కిరేణి గ్రామంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశం లో మోడరేట్ విధానాలను బలపరచటాన్ని టి.బి. విట్టల్ రావు మినహా జిల్లా కమిటీ మొత్తం  వ్యతిరేకించటం వల్ల జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి న్యాయం చేయలేనంటు ఆయన తన జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశాడు. డెబ్బది ఐదు మంది జిల్లా కమిటీ సభ్యులలో  అరవై తొమ్మిది మంది సి.పియం వేపు నిలిచారు. పార్టీని చీల్చటం ఇష్టంలేదని ఈ.సి. సభ్యుడిగా కొనసాగుతానని చెప్పారు, ఆ సమావేశం లోనే జిల్లా  సి.పి.యం. పార్టీ పగ్గాలు శ్రీ చిర్రావూరి లక్ష్మి నరసయ్య చేతికి వచ్చాయి.  జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ గా ఎన్నికైనాడు. శ్రీ మొహమ్మద్ రజబలీ కూడా సి.పి.యం పార్టీలోనే వున్నాడు. 1964 ఆగష్టు నెలలో అనుహ్యం గా శ్రీ నల్లమల గిరిప్రసాద్ సి.పి.ఐ. పార్టీ లో చేరాడు. శ్రీ రావెళ్ళ జానకిరామారావు మొదటినుండి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యని విబేధించిన కారణంగా సి.పి.యం వైపుకు వెళ్లలేదు. 

రెండవ చీలిక.

1967 సంవత్సరంలో ఖమ్మం జిల్లాకు చెందిన సి.పి.యం అనుబంధ సంఘాల యువకులు మరియు విద్యార్థులు కొందరు తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి ప్రారంభించిన మార్శిస్ట్, లెనినిస్ట్ సిద్దాంతాలకు ఆకర్షితులు కావటంతో వారు జిల్లా సి.పి.యం పార్టీ ప్లీనంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రతిపాదనను ప్రవేశ పెట్టగా రెండు ఓట్ల తేడాతో వీగి పోయింది. ప్రతిపాదన వీగి పాయినా వారు అదే పంధాలో వెళ్ళటంతో పాటు సి.పి.యం వ్యతిరేక ప్రచారం చేస్తుండటం తో  వారిని సి.పి.యం పార్టీ నుండి జిల్లా కమిటీ బహిష్కరించింది. ఇండియా లో ప్రధమంగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే మార్క్సిస్ట్, లెనినిస్ట్ ఉద్యమం ఉద్యమం ప్రారంభ అయింది. ఫలితంగా సి.పి.యం సంస్థాగతంగా చాలా నష్ట పోయింది. ఆ పరిణామం ఖమ్మం జిల్లా సి.పి.యం పై కూడా రాజకీయంగా ప్రతికూల  ప్రభావం చూపింది.

సి.పి.యం నుండి బహిష్కృతులైన వారు 1968, జూన్ 15 వ తేదీన ఖమ్మం లో భారీ బహిరంగ ప్రదర్శన చేసి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. శ్రీ చండ్ర పుల్లారెడ్డి ఆ సమావేశం లో ప్రసంగించారు. తరువాత అదే సంవత్సరం అక్టోబర్ నెలలో ఆరవ తేదీన కొత్తగూడెంలో జరిగిన బహిరంగ సభలో శ్రీ తరిమెల నాగిరెడ్డి ప్రసంగించారు. 

ఖమ్మం సమావేశం తరువాత ఖమ్మం జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు అయింది. మధిర తాలుకా గ్రామాలు మడుపల్లి. ముస్తికుంట్ల, గోవిందాపురం  ఖమ్మం, కొత్తగూడెం. పిండిప్రోలు, గార్ల, ఎల్లందు, సుబ్లవీడు నుండి వచ్చిన నాయకులతో సి.పి.ఐ.(యమ్.యల్) ఆవిర్భవించింది. ప్రారంభంలో పార్టీ చిన్నగానే వున్నా శ్రీకాకుళ గిరిజన పోరాటం ప్రభావంతో కొక్కిరేణి గ్రామంలో జరిగిన జనరల్ బాడీ సమావేశం తరువాత యం.యల్ పార్టీ కొత్త పుంతలు తొక్కి పగిడేరు గ్రామంలో భూస్వామి ఇంటిపై దాడితో ప్రారంభం అయిన ఉద్యమం అనేక మార్పులకు లోనై కొత్త పుంతలు తొక్కింది. ఎల్లందు ఏరియాలో ప్రముఖంగా పునాదులు పదిలం చేసుకుంది. సి.పి.యం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎల్లందు ఏరియాలో యం.యల్ పార్టీకి వ్యతిరేకంగా  కార్యకలాపాలు చేయవద్దని స్థానిక నాయకత్వానికి ఆదేశం యిచ్చి వుండటంవల్ల కూడా అక్కడ యం.యల్ పార్త్రి పునాదులు ధృడంగా పడినవి.

ఇలా ఖమ్మం జిల్లాలో కామ్రేడులు వరుసగా చీలిపోవటం వల్ల సంస్థాగతంగా బలహీన పడి పార్ల మెంటరీ  ఎన్నికలలో వెనుక పడిపోయారు. ఎవ్వరో గొప్ప నాయకులు కమ్యునిస్ట్ పార్టీ మెడలు వంచి విజేతలు కాలేదు. ఇది అంతా కామ్రేడుల స్వయం క్రుతాపరాధం మాత్రమే. జాతీయ అంతర్ జాతీయ విధానాల పర్యవసానాలే. ఎన్నెన్నో చారిత్రిక తప్పిదాల ఫలితమే. 

పార్టీలో అంతర్గత సంక్షోభం. 
దీనికి తోడు  సి.పి.యం జిల్లా పార్టీ లో అప్పటి జిల్లా పార్టీ సెక్రటరీ శ్రీ చిర్రావూరి లక్ష్మి నరసయ్య నాయకత్వ విషయంలో తలెత్తిన సంక్షోభం తో జిల్లాలో వున్న అధికార కాంగ్రెస్ పార్టీ సి.పి.యం అంతర్గత వ్యవహారాలలో వేలు పెట్టటం ప్రారంభ అయినది. 

తనకు జిల్లా నాయకత్వ బాధ్యతలకోసం పార్టీలో కొట్లాడిన శ్రీ మొహమ్మద్ రజబలీ వ్యక్తిగతం గా శ్రీ చిర్రావూరి లక్ష్మి నరసయ్య నాయకత్వాన్ని వ్యతిరేకించి సి.పి.ఐ లోకి వెళ్లి పోవటంతో కామ్రేడుల తదుపరి రాజకీయాలను కాంగ్రెస్ నాయకులు ప్రభావితం చేశారు.

కామ్రేడుల చీలికలతో శ్రుతిమించిన  సి.పి.ఐ మరియు సి.పి.యం పార్టీ కార్యకర్తల పరస్పర యుద్దాలు ఒకవైపున.......

కాంగ్రెస్ లో మొగ్గ తొడిగిన గ్రూప్ తగాదాలు మరోవేపున ...

ఈ రెండు అనుసంధానమై ఖమ్మం జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి.

అవి ఏమిటో నా తదుపరి వ్యాసం లో చూద్దాము.

                             .....PENDYALA VASUDEVARAO


<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Tuesday, October 2, 2018

ఖమ్మంలో మహాత్మా గాంధి--ప్రజల మదిలో జాతి పిత జ్ఞ్యాపకాలు..

60 . (ఖమ్మం చరిత్ర-8) 

మహాత్మాగాంధీ 

ఖమ్మం వచ్చినప్పటి వేళ 

ఖమ్మం పట్టణ చరిత్రలో మరచిపోలేని చారిత్రక ఘట్టం.

Mahatma Gandhi's meeting was held in my ancestral land in Khammam town near Venkatagiri Railway gate 5 August 1946.— 



1942 సంవత్సరం ఆగస్ట్ నెలలో ప్రారంభమైన క్విట్ఇండియా ఉద్యమం 1945 లో ముగియటంతో వెంటనే గాంధీజీ దక్షిణ భారత హింది భాషా ప్రచార ఉద్యమాన్ని చేపట్టి పర్యటనలు ప్రారంభించారు.  

ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ఈసమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే 1946 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పై వున్న నిషేధాన్ని ఎత్తి వేసింది. కమ్యూనిస్ట్ పార్టీ పై నిషేధాన్ని విధించింది. 1946, ఫిబ్రవరి 3, 4 తేదీలలో మద్రాస్ లో నిర్వహించిన  దక్షిణ భారత హింది భాషా ప్రచార కార్యక్రమం నుండి వస్తున్న గాంధీజీ, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కోరిక మేరకు మార్గ  మధ్యమంలో రైల్ ఆగగా ఫిబ్రవరి 5 వ తేదిన మహాత్మాగాంధి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కు అప్పుడు శ్రీ గెల్లా కేశవా రావు ప్రెసిడెంట్ గా వున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవమ్ సందర్భము గా స్వాతంత్ర్య సమర యోధులను సత్కరించే కార్యక్రమంలో భాగం గా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా శ్రీ చింతనిప్పు లాలయ్య, కొత్త సీతారాములుతో కలిసి నేను వెళ్లినప్పుడు శ్రీ గెల్లా కేశవా రావు గారు ఆ మరపురాని ఘట్టాన్ని వివరించారు. "బాబు మేము ఏర్పాటు చేసిన సభా వేదిక స్థలం మీదే, ఇప్పుడు మీకు లేదులెండి" అని నాతో చెప్పారు. అలాగే గాంధిజీ ఆసీనులైన సభా వేదికను చెక్క బల్లలతో సుమారు ఇరవై అడుగుల ఎత్తు లో నిర్మించామని చెప్పారు. 15 నిమిషాల పాటు హింది లో సాగిన ఆయన ప్రసంగాన్ని శ్రీ మోటూరు సత్యనారాయణ తెలుగు అనువాదం చేసారని కూడా చెప్పారు. గాంధిజీ వెంట ఆయన కార్యధర్స్యులు ప్యారేలాల్ గాంధీ, మహాదేవ దేశాయ్ వున్నారని చెప్పారు. కమలాదేవి బజాజ్ కూడా వెంట వున్నారు.

అది ఖమ్మం పట్టణ చరిత్రలో మరచిపోలేని చారిత్రక ఘట్టం. మధుర క్షణాలు. అప్పుడు ఖమ్మం నిజాం రాష్ట్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేది. నిజాం విమోచనం/ఇండియాలో విలీనం అయిన తరువాత హైదరాబాద్ రాష్ట్రంలో 1953 సంవత్సరంలో ప్రత్యేక జిల్లాగా ఏర్పడినది.

1946 సంవత్సరంలో ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వాలనే ఆలోచనతో బ్రటిష్ ప్రభుత్వం "బ్రిటిష్ కాబినెట్ మిషన్ " ప్రతిపాదనను తీసుకవచ్చింది. ఇది దేశంలో అలజడికి కారణం అయినది. దేశ విభజనకు అది దోహద పడుతుందనే అనుమానం తో గాంధి దీనిని నిరాకరించాడు. కాని నెహ్రు, పటేల్ లు దేశం ముస్లిం లీగ్ పరం అవుతుందనే భయంతో గాంధి మాటను త్ర్హోసిపుచ్చారు. హిందూ-ముస్లిం కొట్లాటలు తారాస్థాయికి వెళ్లి అయిదు వేల మంది ప్రజలకు పైగా హత్య గావించ బడ్డారు. పర్యావ సానమే కొన్ని శక్తులు గాంధిని హత మార్చ ప్రయత్నిన్చాయి.

మహాత్మా గాంధి మరణం --ప్రజల్లో తీరని విషాదం.


1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. ఆయన మాటల ప్రకారం"1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అషా ఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కలిగిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు. కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లాయి. 

అంతే.

జాతి పిత నేల కొరిగాడు. దేశం యావత్తూ విషాదం లో మునిగి పొయింది.

                                                                .......PENDYALA VASUDEVARAO

----Published on Date: 17.04.2018.
Republished on Date: 03.10.2018.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Monday, September 3, 2018

ఆ నాటి మా ఖమ్మం....ఒక కురుక్షేత్రం..

59. (ఖమ్మం చరిత్ర-7) 

ఆనాటి మా ఖమ్మం .... ఒక కురుక్షేత్రం.


ఖమ్మం జిల్లా ఎన్నికల చరిత్ర ప్రముఖం గా ఖమ్మం, వేమ్సూర్ మరియు మధిర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర తో ముడిపడి వుంది.

ఖమ్మంజిల్లా చరిత్ర ప్రస్తావనలో ఖమ్మం నాయకుల గురించి చెప్పుకోవలసి వస్తే శ్రీబొమ్మకంటి సత్యనారాయణరావు, పెండ్యాల సత్యనారాయణరావు, శ్రీ జలగం వెంగళరావు మరియు శీలం సిద్దారెడ్డి  పేర్లు ప్రముఖంగా వస్తాయి.

1949 సంవత్సరం నైజాం ప్రాంతంలో కీలకమైనవి. ఈ ప్రాంతంలో ముఖ్యమైన కమ్యునిస్టు పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాల్లో మార్పులు సంభవించాయి. వరంగల్ జిల్లాలో కుడా ఈ రెండు పార్టీల నాయకత్వాలు మారిపోయాయి. ఈ రెండు పార్టీల జిల్లా మరియు రాష్ట్ర పార్టీల నాయకత్వంలో ఖమ్మం నాయకులే వుండటం గమనార్హం. వాటి ఫలితమే 1952 ఎన్నికల నుండి జరిగిన రాజకీయ పునరేకీకరణలు.

విశాలాంధ్ర సిద్ధాంతంను(ఆంధ్ర మరియు తెలంగాణా ప్రాంతాల విలీనం—భాషా ప్రయుక్త రాష్ట్రాలు) వ్యతిరేకించిన వారు కాంగ్రెస్ పార్టీ లో ఒంటరి వారు కావటం, నైజాం సంస్థానం ఇండియాలో విలీనం కావటాన్ని కమ్యునిస్టు పార్టీ వ్యతిరేకించిన కారణంగా ఆ పార్టీ నుండి కొందరు పార్టీ వీడిపోవటంతో ఈ మార్పులు సంభవించాయి. 

హైదరాబాద్ రాష్ట్రం లో 1949 నుండి 1951 ఆఖరు వరకు కమ్యునిస్ట్ లు ఆయుధాలు చేబూని underground కెళ్ళి పోయారు. దాదాపు అది భారత ప్రభుత్వం పై యుద్ధం అనే అనుకోవాలి. 1949 నుండి కాంగ్రెస్ పార్టీ వారు భారత ప్రభుత్వంలో వున్న కాంగ్రెస్ హేమాహేమీలతో సంప్రదింపులతో రాజ్యాధికారం కోసం రాజకీయ చదరంగం మొదలెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ హేమాహేమీ నాయకులంతా ఢిల్లీ చట్టూ చక్కెర్లు కొట్టారు. కమ్యునిస్ట్ అగ్రనాయకులు కొందఱు పోరాటం ఆపే ప్రయత్నంలో అనుమతికై రష్యా వెళ్లారు. ఎన్నికలసమీపించే తరుణంలో  కమ్యునిస్ట్ సాయుధ పోరాటం పోరాటం ముగిసింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతింది శ్రీ వెల్లోడి హైదరాబాద్ రాష్ట్ర పాలనా బాధ్యతలలో వున్నారు. POLICE ACTION తరువాత హైదరాబాద్ రాష్ట్రం లో వున్నా మిలిటరీ గవర్నర్ MAJOR GENARAL CHOUDHARY తరువాత శ్రీ వెల్లోడి నియమించబడ్డారు. కాంగ్రెస్ రాజకీయ చదరంగం నిరంతర ప్రక్రియలా కొనసాగింది.

మొదటి నుండి శ్రీ పండిత నెహ్రు విశాలాంధ్రకు వ్యతిరేకంగా వున్నా హైదరాబాద్ రాష్ట్రంలో కన్నడ, మహారాష్ట ప్రాంతాలకు చెందిన  ఔరంగాబాద్ మరియు గుల్బర్గా Divisions  మినహాయిస్తే తెలంగాణా ప్రాంతంలో వున్న వరంగల్ మరియు గుల్శానాబాద్(మెదక్) Division ల కమ్యునిస్ట్ పార్టీ ప్రభావానికి మున్ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాల పరంగా నష్టపోతుందని సర్దార్  వల్లభాయి పటేల్ తో సహా మిగతా నాయకులందరు ఆయను ఒప్పించటం జరిగింది. 

కమ్మ్యునిస్ట్ ల ప్రభావము అంటే ముందుగా నల్లగొండ  మరియు వరంగల్  జిల్లాలే  వస్తాయి. ప్రధమ సారస్వత ఎన్నికల ముందర ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు రెండింటిలో కనిపించిన కమ్యునిసస్ట్ ల  హవా అందరిని ఉలిక్కి పడేలా చేసింది. ఎన్నికలు అయిపోయిన తరువాత ఫలితాలు విస్మయ పరిచాయి.

ప్రధమ సారస్వత ఎన్నికల ప్రచారానికి పండిత జవహర్లాల్ నెహ్రు కాంగ్రెస్ పక్షాన ప్రచారానికి వరంగల్ పట్టణానికి వచ్చారు. భారీ ఎత్తున జరిగిన ఆ మీటింగ్ కు ప్రజలు ఇసుక వేస్తె రాలనంతగా వచ్చారు. ఖమ్మం నుండి రైలుబోగీల లోపల నిలవబడటానికి కూడా స్థలం దొరుకక రైలు బోగీల టాప్  మీద కుర్చుని జనాలు సమావేశానికి వెళ్లారు. జనాలైతే సమావేశానికి వేళ్ళారు కాని ఓట్లు మాత్రం కమ్యునిస్ట్ అభ్యర్థులకే వేశారు. వరంగల్, నల్లగొండ మరియు ఖమ్మం లోకసభా నియోజక వర్గాలలో కమ్యునిస్ట్ అభ్యర్థులే విజయం సాధించారు. నల్లగొండ లోకసభా స్థానంలో కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ రావి నారాయణరెడ్డి పండిత జవహర్లాల్ నెహ్రు కు వచ్చిన ఆధిక్యం కంటే ఎక్కువ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఫలితాలే చివరకు విశాలాంధ్ర వాదానికి సంపూర్ణ మద్దతు లభించటానికి కారణము అయింది. ఆంధ్రా కమ్యునిస్ట్ నాయకులు కూడా విశాల ఆంధ్రాకే మద్దతు ప్రకటించటంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎర్పడింది.

ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చివరకు ముగ్గురు అభ్యర్థులు రంగంలోకి రాగా ఆంధ్రా మరియు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ బెజావాడ గోపాలరెడ్డి మరియు శ్రీ బూర్గుల రామకృష్ణారావు లను ఇద్దరికి నచ్చజెప్పి  ఆ తరువాత గవర్నర్లుగా పంపారు. శ్రీ నీలం సంజీవరెడ్డి తన రాజకీయ చదరంగపు ఎత్తులతో  తన సొంత వర్గ నిర్మాణ ప్రక్రియలో పావులు కదిపారు. ఆ ఫలితం ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాజకీయ పునరేకీకరణలకు కారణమైనది. 

శ్రీ నీలం సంజీవరెడ్డి 1960 లో AICC PRESIDENT గా ఎన్నికైనందువల్ల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రెసిడెంట్ గా వున్నందువల్ల ఆయన జిల్లాలో వేసిన రాజకీయ పునాది కదలలేదు.

జిల్లా లోని అసెంబ్లీ నియోజక వర్గాల చరిత్ర.


ఎల్లందు ద్విసభ్య అసెంబ్లీ నియోజక వర్గం.


ఎల్లందు అసెంబ్లీ నియోజకవర్గం మొదటి రెండు ఎన్నికలలో  ద్విసభ్య నియోజక వర్గంగా వుండేది. 1978 లో  పూర్తిగా ST లకు రిజర్వు అయ్యేటంత వరకు 1952,1957, 1962 కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ కే.యల్. నరసింహారావు, 1967 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గోగినేని సత్యనారాయణ మరియు 1972  లోకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  శ్రీ వంగా సుబ్బారావు గెలుపొందారు. 1967 మరియు 1972 అసెంబ్లీ ఎన్నికలలో CPI మరియు CPM పార్టీల అభ్యర్థులు ఇద్దరు విడి విడిగా పోటిలో వున్నారు. 1952, 1957 సంవత్సరాలలో రిజర్వేడ్ స్థానంలో వరుసగా శ్రీ ఉకే అబ్బయ్య (సోషలిస్ట్), శ్రీ దొడ్డా నరసయ్య (కాంగ్రెస్) లు గెలుపొందారు.

పాల్వంచ/కొత్తగూడెం  అసెంబ్లీ నియోజక వర్గం.


1957 ఏర్పాటు అయిన పాల్వంచ అసెంబ్లీ నియోజక వర్గంలో మొదటగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కే. సుదర్శన్రావు కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ పర్చా సత్యనారాయణ పై గెలుపొందారు. 1962 ఎన్నికలలో కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ పర్చా సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కే.వెంకటరామారావుపై గెలుపొందారు. 1967 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ పానుగంటి పిచ్చయ్య కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ పర్చా సత్యనారాయణ పై గెలుపొందారు. 

1972 లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గం అవతరించింది. 1972 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ చేకూరి కాశయ్య CPI అభ్యర్థి యం. కొమరయ్య పై గెలుపొందారు.  1978 లో జనతాపార్టీ అభ్యర్థి శ్రీ చేకూరి కాశయ్య కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ వనమా వెంకటేశ్వరరావు పై గెలుపొందారు.

బూర్గంపాడు అసెంబ్లీ చరిత్ర.


1962 లో ఏర్పడిన బూర్గంపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటగా కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ కంగల బుచ్చయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొమరం రామయ్య పై కేవలం నలభై రెండు ఓట్ల తేడాతో గెలిచాడు. 1967 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొమరం రామయ్య కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ కంగల బుచ్చయ్య పై 16,300 ఆధిక్యంతో గెలుపొందారు.1972 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కొమరం రామయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీ జి.సీతయ్య పై 8,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ  చరిత్ర.


1959 లో భద్రాచలం ప్రాంతం ఖమ్మం జిల్లాలో విలీనమైన తరువాత ఆ నియోజకవర్గం జనరల్ సీట్ గా వున్నప్పుడు 1962 ఎన్నికలలో కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ యం.డి.తహసిల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి వాణిరమణారావు పై 13,500 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1967 ఎన్నికలలో శ్రీ కారం కన్నయ్య ఉభయ కమ్యునిస్ట్ అభ్యర్థులపై గెలుపొందారు. 1972లో శ్రీయం.రామచంద్రయ్య ఉభయ కమ్యునిస్ట్ అభ్యర్థులపై గెలుపొందారు.

మొదటి ఎన్నికల దశాబ్దంలో మధిర మరియు వేమ్సూర్ అసెంబ్లీ చరిత్ర.


1. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు.


శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు స్వాతంత్ర్య సమరయోధులు. నింగి కెగసి క్రింద పడ్డ కెరటం. నిజాం వ్యతిరేక పోరాటంలో శ్రీ జమలాపురం కేశవరావు నాయకత్వంలో పనిచేశారు. వరంగల్ జిల్లా వున్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో ఒకరు. రజాకార్ ముమెంట్లో బోర్దర్ కాంప్ లో కీలక భూమికను పోషించిన వారు. 1952 సంవత్సరంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సారధిగా శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు వున్నారు. శ్రీ జమలాపురం కేశవరావు తరువాత ఖమ్మం కాంగ్రెస్ లో శ్రీ బొమ్మకంటి కీలక వ్యక్తి అయినారు. 

వరంగల్ జిల్లాలో అంతర్భాగం అయిన ఖమ్మం ప్రాంతం 1950 లో వెల్లోడి ప్రభుత్వంలో అదనపు జిల్లాగా ఆవిర్భవించింది. 1953 లో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లా ఏర్పడినది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీ ను ఏర్పాటు చేయవలేనని నిర్ణయించింది. హైదరాబాద్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మొదట ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు కమిటీ డిగ్రీ కళాశాలలు ప్రారంభం అయినవి. ఖమ్మం పట్టణంలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు అధ్యక్షుడుగా, శ్రీ సర్వదేవభ్ట్ల నరసింహ మూర్తి (యెస్.యన్.మూర్తి) ప్రధాన కార్యదర్శిగా ఏర్పడిన పేరెంట్స్ కమిటీ కృషితో జగ్గయ్యపేటకు చెందిన శ్రీ గెంటాల నారాయణ రావు, తన ఇష్ట దైవం పేరుతో తన పేరు కలిపి పెట్టె షరతు మీద  ఖమ్మం లో డిగ్రీ కాలేజీ స్థాపనకు లక్షరూపాయల నిధులను ఇస్తాననే ప్రతిపాదనను శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు పేరెంట్స్ కమిటీలో ఆమోదించిన ఫలితంగా ఖమ్మం లోని S.R & B.G.N.R COLLEGE ఏర్పాటు అయినదని చెబుతారు. అదే జిల్లాలో మొదటి డిగ్రీ కాలేజీ. ఆ సమయంలో శ్రీ గెంటాల వారికి తన స్వగ్రామం గండ్రాయి లోనున్న తన భూమిని కాకిరాయి వ్యాపారంకు లీజ్ కు ఇవ్వటం వల్ల లక్షల రూపాయలు  ఆర్ధికంగా కలసి వచ్చింది.

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతంలో తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి తన బందువర్గాన్నే ఎక్కువగా వినియోగించుకున్నారు. నేలకొండపల్లి ప్రాంతంలో తన Classmate అయిన  శ్రీ రావులపాటి జానకిరాంరావు కుటుంబాన్ని వేదికగా  చేసుకున్నారు. ఆ నాటి రావు వర్గం రాష్ట్ర నాయకులతో  బంధుత్వాలు కలిగిన నేలకొండపల్లి వాసి శ్రీ కంకిపాటి జగమోహన్రావు ను రాజకీయంగా కలుపుకున్నారు. రాజ్యాధికారం వేపు వడివడిగా అడుగులు వేసిన ఏకైక వ్యక్తి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఒక్కరే. ఆయన అధికారం ఎలా వుండేదంటే మొట్ట మొదటి జిల్లా Collector గా తన పలుకుబడిని వినియోగించి  డిప్యూటి కలెక్టర్ స్థాయి వ్యక్తిని జిల్లా కలెక్టర్ గా నియమించుకొని ఇంట్లో బంట్రోతు గా ఉపయోగించుకున్నట్లు ఆయన పై ఆరోపణ లున్నవి. ఈ మనస్తత్వమే తదుపరి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసింది.

శ్రీ జమలాపురం కేశవరావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ లో బలమైన వర్గమైన విశాలాంధ్ర వాదుల వల్ల నాయకత్వంలో కొద్దిగా వెనుకపడ్డ తరువాత ఆ స్థానం కోసం శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు అనేక చదరంగపు పాచికలను విసిరారు. 1954 లో విశాలాంధ్ర వాదం ఆధారంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి పోటిచేసి శ్రీ కొండా వెంకటరంగారెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఆనాటి ఎన్నికలు మధిరలోనే పార్టీ పరిశీలకుల సమక్షంలో జరగటం విశేషం. పిదప ముఖ్యమంత్రి పదవికి ఎన్నో పాచికలు విసిరారు. 

శ్రీ నీలం సంజీవరెడ్డికి చివరినిమిషంలో మద్దతు ప్రకటించిన వర్గంలో ప్రముఖుడిగా వున్నా, 1958 లో మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో శ్రీ జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష భాధ్యతల స్వీకరించటంతో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డి కి వ్యతిరేకంగా 1959 లో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఏర్పడిన వర్గంతో చేతులు కలిపారు.

P.V.G.RAJU చైర్మన్ గా విజయవాడ పట్టణం లో 20TH MAY 1959 లో ఏర్పడిన SOCIALISTIC DEMOCRATIC PARTY (SDP) కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినారు. శ్రీ మర్రి చెన్నారెడ్డి అప్పుడు అదే పార్టీ తరఫున LEGISLATURE PAARTY నాయకుడు అయినారు.

ఆంధ్రా నాయకులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు మరియు శ్రీ కొండావెంకట రంగారెడ్డి వర్గం అండతో ముఖ్యమంత్రి కావచ్చని భావించారు. చివరకు ఆయన ఎక్కిన నిచ్చెన పట్టు తప్పింది. శ్రీ PV.G.RAJU మరియు శ్రీ మర్రి చెన్నారెడ్డిలు 20th MAY 1959 న SDP రద్దు చేస్తున్నట్లు ప్రకటించి  కాంగ్రెస్ పార్టీ లో చేరి శ్రీ దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో శ్రీ బొమ్మకంటి ఎన్నికల రాజకీయ రంగంలో వెనుకపడి పోయారు. SDP యొక్క జీవిత కాలం కేవలం ఏడు నెలలు మాత్రమే. 

శ్రీ జమలాపురం కేశవరావును మధిర ఎన్నికల బరినుండి తప్పిస్తే తాను మధిర అసెంబ్లీ నుండి అసెంబ్లీలో ఆడుగు పెట్టవచ్చని భావించి మధిర అసెంబ్లీకి 1952 సంవత్సరంలో శ్రీ జమలాపురం కేశవరావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకుండా తన పలుకుబడితో అడ్డుకున్నారని ఆయన పై అభియోగాముంది. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఆత్మీయులు మాత్రం ఆ రాజకీయం శ్రీ మాడపాటి రామచంద్రరావు చేశాడంటారు. ఆ స్థానంలో పార్టీ టికెట్ ను శ్రీ మాడపాటి రామచందర రావు దక్కించుకున్నారు. అప్పుడు శ్రీ మాడపాటి  రామచందర్ రావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగాను మరియు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు వరంగల్ జిల్లా  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగాను వున్నారు.

ఇక శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుకి వేమ్సూర్ అసెంబ్లీ టికెట్ తప్ప జిల్లాలో వేరే అవకాశం లేదు. చివరకు 1952 సంవత్సరంలో ప్రధమంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వేమ్సూర్ స్థానానికే పార్టీ టికెట్ ను సంపాదించారు. 1957 లో మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుండి, 1962 లో ఎల్లందు అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసినా 1957 లో మధిరలో మాత్రమే విజయాన్ని సాధించారు. క్రమంగా 1967 ASSEMBLY ఎన్నికల తరువాత ఎన్నికల బరిలోనుండి తప్పుకున్నారు.

మధిర అసెంబ్లీ ఎన్నికల గణంకాలు.


 1957 లో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు (21,149 ఓట్లు రాగా) కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ నండురు ప్రసాదరావు (18,546 ఓట్లు వచాయి) పై 2603 ఓట్ల ఆధిక్యం తో గెలుపొందారు. 

1962 లో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన తోడల్లుడు కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థి అయిన శ్రీ K.L.నరసింహారావు పై ఓటమి చెందారు. అప్పుడు శ్రీ బొమ్మకంటికి 14,914 ఓట్లు రాగా శ్రీ కే.యల్.నరసింహారావుకు 21,557ఓట్లు వచాయి. శ్రీ కే.యల్.నరసింహారావు 6,643 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

1967 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీ టికెట్ పొందలేక పోవటంతో ఇండిపెండెంట్ గా పోటి చేసి ఓటమిని చెందారు. ఆ ఎన్నికలలో శ్రీ దుగ్గినేని వెంకయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ బోడేపూడి వెంకటేశ్వరరావు సి.పి.యం అభ్యర్థిగా పోటి చేయగా శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఇండిపెండెంట్ గా పోటి చేశారు. శ్రీ దుగ్గినేని వెంకయ్యకు  26,821 ఓట్లు రాగా శ్రీ బోడేపూడికి 15,672 ఓట్లు మరియు  శ్రీ బొమ్మకంటికి 14,437 ఓట్లు వచ్చాయి. 

1961సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన లో SC లకు రిజర్వు కావలసిన వేమ్సూర్ అసెంబ్లీ నియోజకవర్గం OCకి కేటాయించి అప్పుడే ఏర్పడిన పాలేరు అసెంబ్లీ నియోజక వర్గాన్ని SC లకు కేటాయించటంలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు గారి ప్రమేయాన్ని ఆ రోజుల్లో చెప్పుకొనేవారు. ఆ విధంగా చేసిన మార్పు ఆయనకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. శ్రీ వెంగళరావు ఆ స్థానంలో స్థిరపడి పోయారు.

2.శ్రీ జలగం వెంగళరావు.


శ్రీ జలగం వెంగళరావు పశ్చిమ గోదావరి జిల్లాలోని  నిడదవోలు సమీపంలో గల నందమూరు గ్రామంలో శ్రీ జలగం వెంకట్రావు ఇంట జన్మించారు. శ్రీ జలగం వెంకట్రావు గారు పదిహేను ఎకరాల ఆసామి. ఆయన మీర్జాపురం రాజా వారి సంస్థానంలో కామ్ దార్(ఎస్టేట్ సూపర్ వైసర్) గా పనిచేసేవారు. నూజివీడు దగ్గర వున్న కేసరపల్లి వారి ప్రధాన కేంద్రం. Gannavaram high school లో S.S.C. చదివిన శ్రీ జలగం వెంగళరావు తొట్లవల్లూరు గ్రామపంచాయతి పరిధిలో కారోబార్ (క్లర్క్) ఉదోగంలో చేరి కొంత కాలం పని చేశారు. శ్రీ వెంగళరావు మ్యారేజ్ అయిన తరువాత ఖమ్మం జిల్లాలోని వంగా ముత్యాల బంజరకు వలస వచ్చారు. అడవులలోని చెట్లను కొని కర్ర బట్టిలను పెట్టి బొగ్గు తయ్యారు చేసే వ్యాపారంలో భాగా స్వాములు అయినారు. ఈ వ్యాపారం చేసే క్రమంలో ఆ బంజరకు చుట్టుపట్ల గ్రామాలతో ఆయనకు మంచి పరిచయాలు అయినవి.

ఆ విధంగా వ్యాపారంలో తలమునకలు అయిన శ్రీ వెంగళరావు జీవితాన్ని రాజకీయాలలో ప్రవేశించమని ఆ ప్రాంతంలో కల్లు డిపో వ్యాపారంలో(ఆ రోజులలో సారా డిపోలు లేవు) వున్న ఏలూరు కు చెందిన శాస్త్రి గారు సలహా ఇవ్వటం, శాస్త్రి గారు తనకు తెలిసిన జిల్లా నాయకుడు  శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ను పరిచయం చేయటం జరిగింది. ఆ విధంగా వెంగళరావు గారు  రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తిరువూరు బోర్డర్ క్యాంపులో(తిరువూరు ఆయన అత్తగారి ఊరు కూడా) పనిచేసిన శ్రీ వెంగళరావుకు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుతో 1952 కు ముందరే మనస్పర్ధలు వచ్చాయి. శ్రీ బొమ్మకంటి MLA గా జిల్లాలో ఎక్కడ నిలబడితే  అక్కడ నిలబడి  ఆయనను ఓడిస్తానని  బహిరంగం గానే  చెప్పారు.


శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు వేమ్సూర్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు కావటంతో శ్రీ జలగం వెంగళరావు ఇండిపెండెంట్ గా ఆయనపై పోటి చేశారు. శ్రీ వెంగళ రావుకు ప్రారంభంలో వ్యాపారరీత్యా ఆ  నియోజకవర్గం అంతా పరిచయం అయివుండటం మరియు  ఆతరువాత పార్టీ కార్యక్రమాల కోసం గ్రామాలన్నీ  తిరగటం వల్ల అక్కడి ప్రజలతో మంచి సంభందాలు వుండేవి.

వేమ్సూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఎవ్వరిని నిర్ణయం చేయాలానే భాధ్యతని మదిరకే చెందిన కమ్యునిస్ట్ నాయకుడు శ్రీ వాసిరెడ్డి వేంకటపతికి కమ్యునిస్ట్ పార్టీ భాధ్యతల అప్పగించింది. అశ్వారావుపేట జమిందారు కుమారుని రంగంలోకి దించి, వెంగళరావు గారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావును ఓడించ వచ్చని కమ్యునిస్ట్ పార్టీ భావించింది. వారు ఊహించినట్లు  కాకుండా శ్రీ వెంగళ రావు గారే స్వయంగా పోటి చేశారు. ఆ ఎన్నికల తరువాత శ్రీ జలగం వెంగళరావు కు బ్రాహ్య్మణ ద్వేషి అని ముద్ర పడినది. అంతకు ముందు శ్రీ వెంగళరావు ఆ ప్రాంత రైతుల పక్షాన నిలువబడి ఆ నియోజకవర్గం లోని కొన్ని  గ్రామాల  పట్వారిలతో రెవిన్యూ దస్త్రాల నిర్వహణ గురించి యుద్ధం చేసేవారని అదే శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుతో విబేధాలకు కారణమని చెబుతారు.

1952 లో PDF పేరు మీద పోటి చేసిన కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థే వేమ్సూర్ ఎన్నికలలో (16,092) గెలిచినా ద్వితీయ స్థానంలో శ్రీ జలగం వెంగళరావు గారే (15,543) వున్నారు. కేవలం 549 ఓట్ల ఆధిక్యంతోనే కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ కందిమళ్ళ రామకృష్ణారావు గెలిచారు. శ్రీ బొమ్మకంటికి 4,580 ఓట్లు వచ్చినవి. కందుకూరు గ్రామ ఓట్లతోనే కమ్యునిస్ట్ అభ్యర్ధీ గెలిచాడని చెప్పేవారు.

వేమ్సూర్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఓడిపోవటంతో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షా చర్యలలో భాగంగా శ్రీ జలగం వెంగళరావును ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుండి బహిష్కరించింది. తరువాతి పరిణామాలలో శ్రీ వెంగళరావు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు దగ్గరకు సంప్రదింపులకు వస్తుండేవారు. 

“వరంగల్/ఖమ్మం జిల్లాలో  దశాబ్దంన్నర ఎన్నికల రాజకీయం” ఆర్టికల్ లో 1957 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంభందించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల టికెట్స్ నిర్ధారణకు సంభందించిన వివరాలు దానిలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు పాత్ర గురించిన వివరణ ఉన్నది.

1957 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలలో మార్పుల ఫలితంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో నూతన యువ నాయకత్వం ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వ భాధ్యతలను శ్రీ వెంగళరావుకు అప్పగించే యోచనలో వేమ్సూర్ అసెంబ్లీ టికెట్ ను  ఆయన తమ్ముడు శ్రీ జలగం కొండలరావు కు ఇవ్వటం జరిగింది. శ్రీ వెంగళరావు పై కాంగ్రెస్ పార్టీ విధించిన నిషేధకాలం పుర్తికానందున ఆయనకు టికెట్ ఇవ్వటం సాధ్యపడలేదు. శ్రీ జలగం కొండలరావు తన అన్నగారికి లక్ష్మనుడు వంటి వారు. శ్రీ వెంగళరావు తన తదుపరి రాజకీయ జీవితంలో కూడా తదుపరి జరిగిన జిల్లా పరిషద్ ఎన్నికలలోను, లోకసభ ఎన్నికలలోను  శ్రీ కొండలరావు కు పదవులను అప్పగించి అధికారాన్ని గుప్పెట పట్టారు. 

శ్రీ వెంగళరావు గారితో బాటు మదిరకు చెందిన శ్రీ శీలం సిద్దారెడ్డి కూడా సంజీవరెడ్డి గారి ఆశీర్వాదంతో అప్పుడే రాజకీయ తెరపైకి వచ్చారు. శ్రీ శీలం సిద్దారెడ్డి కూడా 1952 మధిర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశాడనే అభియోగంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆరు సంవత్సరాలు భాహిష్కరించింది. 

1957 లో వేమ్సూర్ అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ జలగం కొండలరావు (24,680) PDF అభ్యర్థి శ్రీ వట్టికొండ నాగేశ్వరరావు (16,943) పై 7,737 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా వున్న శ్రీ నీలం సంజీవరెడ్డి ఇచ్చిన సంపూర్ణ రాజకీయ సహకారంలతో 1958 లో పార్టీ విధించిన నిషేధ కాలం పూర్తి కాగానే శ్రీ జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. 1959 లో ఖమ్మం జిల్లా పరిషద్ అధ్యక్షుడయ్యారు. 1962 లో వేమ్సూర్ MLA అయినారు.  జిల్లాలో ఇవి చక చకా జరిగిన పరిణామాలు. ఆ రోజులలో పంచాయత్ రాజ్ వ్యవస్థ లోని సంస్థలకు పదవీ కాలం ముడు సంవత్సరాలు మాత్రమే వుండేది. శ్రీ జలగం వెంగళరావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా వున్నప్పుడు శ్రీ శీలం సిద్దారెడ్డి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వున్నారు. వెంగళరావు గారు జిల్లా పరిషద్ అధ్యక్షుడు కాగానే శ్రీ శీలం సిద్దారెడ్డి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినారు. 

శ్రీ జలగం వెంగళరావు ప్రప్రధమంగా 1962 లో వేమ్సూర్ అసెంబ్లీ ఎన్నికలలో కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ వట్టికొండ నాగేశ్వరరావు పై 16,583 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందటం ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆప్పుడు శ్రీ వెంగళరావుకు 34,436 ఓట్లు రాగా శ్రీ వట్టికొండ నాగేశ్వరరావుకు  17,853 ఓట్లు వచ్చాయి.

తిరిగి 1967 లో వేమ్సూర్ అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ జలగం వెంగళరావు (37,595) INDIPENDENT అభ్యర్థి శ్రీ మోరంపూడి వెంకయ్య (13,220) పై 24,375 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ తరువాత ఎన్నికలలో వేమ్సూర్ అసెంబ్లీ నియోజక వర్గం అదృశ్యం అయి సత్తుపల్లి నియోజక వర్గం గా ఆవిర్భవించింది.

శ్రీ జలగం వెంగళరావు రాజకీయాలలోకి వచ్చిన దగ్గర నుండి ఫుల్ టైం వర్కర్ గా వుండటం ఆయనను జిల్లా రాజకీయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించటానికి కారణమైంది. క్రమశిక్షణ గల జీవితం ఆయన సొంతం. టైం కు నిద్ర ఆహారం తప్పనిసరి. రాత్రి పది గంటలు అవుతే ఎట్టి పరిస్థితులలో అయినా నిద్రకు ఉపక్రమించ వలసిందే. 

మొదటి అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాదుతో సహా ఎక్కడకు వెళ్ళినా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారితో ఆయన జీప్(JEEP) లోనే వెళ్ళే వారు. డ్రైవింగ్ ఎప్పుడు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారే చేసేవారు. జీప్ లో ప్రయానించేటప్పుడు ఏ మాత్రం స్పీడ్ అనిపించినా భయపడే వారు. స్పీడ్ తగ్గించమని గొడవ చేసేవారు.

1957 అసెంబ్లీ ఎన్నికలు అయిన తరువాత జిల్లా కాంగ్రెస్ లో ఒక టీం ఏర్పాటు అయింది. ఎక్కడడకు వెళ్ళినా వారు అందరు కలిసే వెళ్ళేవారు. వారిలో పెండ్యాల సత్యనారాయణరావు గారు, జలగం వెంగళరావు గారు, శీలం సిద్దారెడ్డి గారు, కోట పున్నయ్య గారు మరియు హీరాలాల్ మోరియా గారు వుండేవారు. 


వారంతా హైదరాబాద్ వెళ్ళితే రవీంద్ర భారతి ఎదురుగా వున్న గోపి హోటల్లో దిగేవారు. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు లాంటి జిల్లాకాంగ్రెస్ నాయకులు అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీసు ప్రక్కనున్న వసంత విహార్ లో దిగేవారు. జిల్లాపరిషత్ చైర్మన్ అయ్యేవరకు ఖమ్మం వస్తే శ్రీ శీలం సిద్దారెడ్డి గారితో కలిసి ఖమ్మంలో ఖాళీగా వున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారి Quarter లోనే బస చేసేవారు. వారికి ఖమ్మం పట్టణంలో సొంత ఇల్లు లేకపోవటం, Hotels లో బస చేయటం ఆరోజుల్లో అలవాటు లేకపోవటం కారణం. 

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మొదటితరం కాంగ్రెస్ పార్టీ నాయకులలో శ్రీ జమలాపురం కేశవరావు మినహా మాస్ లీడర్స్ ఎవ్వరులేరు. అందరు త్యాగధనులే అయినా మాస్ లీడర్స్ కాకపోవటం వల్ల ఎన్నికల రణరంగంలో తిరుగులేని విజేతలుగా నిలువ లేక పోయారు. కమ్యునిస్ట్ పార్టీలో నాయకులు ఎక్కువ మంది మాస్ లీడర్స్ యే. 

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశుకున్న శ్రీ జలగం వెంగళరావు రాష్ట్ర స్థాయికి పోయే వరకు తాను నమ్ముకున్న ఆత్మీయుల సలహాలను మరియు రాష్ట్ర స్థాయి పదవులు వచ్చిన తరువాత సంభందిత IAS ఆఫీసర్స్ సలహాలను పాటించేవారు. ఆ విధంగా జిల్లా రాజకీయాలపై పట్టును సాధించారు. ఫీల్డ్ వర్కేర్ గా పనిచేసినందు వల్ల కార్యకర్తలను పేర్లతో సహా గుర్తు పెట్టుకునే వారు. తనకు రాజకీయ శత్రువులు అనుకుంటే ఎవ్వరైనా ఖమ్మం గాని, హైదరాబాద్ గాని వస్తే వాళ్ళు ఎందు వచ్చారో తెలుసికుని మరీ వారి పని చెడగొట్టే వారని ప్రతీతి. అలాగే ఆయన Highly Ambitious person అని ఆయన విమర్శకులు ఒకరు తన అభిప్రాయం వేల్లడిన్చారు. 

ఖమ్మం అసెంబ్లీ ద్విసభ్య నియోజక వర్గం.


ఖమ్మం అసెంబ్లీ  నియోజక వర్గం విషయానికి వస్తే సంజీవరెడ్డి వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా 1957 సంవత్సరంలో పెండ్యాల సత్యనారాయణ రావు గారికి ఆహ్వానం అందింది, కాని ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. 1952 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తటస్థంగానే వున్నారు. ఆయన శివారు గ్రామానికే చెందిన శ్రీ కర్నాటి కృష్ణయ్య కమ్యూనిస్ట్ అభ్యర్ధి గా పోటి చేసి గెలుపొందారు.


మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఖమ్మం జిల్లా వర్గ రాజకీయాలలో 1957 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు వర్గానికి ఖమ్మం మరియు మధిర అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. శ్రీ బొమ్మకంటి సూచన మేరకు  ఖమ్మం తాలుకా గోకినేపల్లీ గ్రామానికి చెందిన శ్రీ చావా వెంకటకోటయ్యకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ టికెట్ ను యిచ్చింది. హయగ్రీవాచారి గారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా వున్నప్పుడు వెంకటకోటయ్యగారు జిల్లా కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా వున్నారు. శ్రీ చావా వెంకటకోటయ్యకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేయటానికి కొన్ని ప్రతిబంధకాలు ఎదురైనవి. ఆ సమయంలో ఆయనకు సాయంసంధ్య వేళ పాము కరచినందువల్ల ఎన్నికలకు అది శుభసూచికం కాదని ... తాను పోటి చేయలేనని ఎన్నికలబరిలో నుండి తప్పుకున్నారు.

ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని జీప్, సైకిల్  లేదా ఎడ్ల బండలకు కట్టుకుని ఖమ్మం తాలుకా గ్రామాలలో  ఎన్నికల సమయంలోనైనా  స్వేచ్చగా తిరిగే పరిస్థితులు లేవు. చాలా కాలం వరకు కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ అభిమానులు సైలెంట్ గా వచ్చి పోలింగ్ బూత్ లలో ఓట్లేసి వెళ్ళీ వారు. పోలింగ్ ఏజెంట్స్  లేని గ్రామాలు కూడా వుండేవి.

ఖమ్మం జిల్లా స్థానికులను  ఎవ్వరిని పెట్టినా ఆయా గ్రామాలలో నెలకొన్న రాజకీయ  వత్తిడుల వల్ల ఎన్నికల బరిలో నిలువ బడ్డ వాళ్ళు ఎప్పుడు జారుకుంటారో తెలీని పరిస్థితి. ఖమ్మం అసెంబ్లీ కి అభ్యర్థిగా ప్రకటించబడిన శ్రీ చావా వెంకట కోటయ్య నామినేషన్ వేయకుండా బరిలోనుంది తప్పుకోవటమే అందుకు నిదర్శనం. అంతకు ముందు కాంగ్రెస్ అభ్యర్థి గా 1952 ఖమ్మం అసెంబ్లీకి  పోటి చేసి ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు  శ్రీ కొలిపాక కిషన్ రావు ఈ సారి  1957 సంవత్సరం జరుగు లోకసభ అభ్యర్థి గా పోటిలో వున్నారు. 

ఆ విధంగా జిల్లాకు సంభందము లేని, జిల్లా ఉద్యమాలతో సంబంధం లేని బయటి వ్యక్తులు జిల్లా ఎన్నికల బరి లోకి వచ్చారు.  తరువాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బయటి వ్యక్తులే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటి చేయటం సాంప్రదాయంగా మారింది.

చావా వెంకటకోటయ్య గారు ఎన్నికలబరి నుండి తప్పుకోవటంతో అభ్యర్థికై మళ్ళీ వేట మొదలయింది. స్థానికేతరులే బయటినుండి రావాలిసిన పరిస్థితి. ఖమ్మం ద్విసభ్య నియోజక వర్గం కావటంతో ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులు కావలసి వచ్చారు. ఒకరు OC అభ్యర్థి, ఇంకొకరు SC అభ్యర్థి.

1.తేళ్ళ లక్ష్మికాంతమ్మ.


మహబూబ్ నగర్ జిల్లాలో గల ఆలంపురం గ్రామానికి చెందిన శ్రీమతి తేళ్ల లక్ష్మికాంతమ్మ తన భర్త శ్రీ సుబ్బారావు హైదరాబాద్ లో రాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్ కావటం తో హైదరాబాద్ లో వుండేవారు. శ్రీ నీలం సంజీవ రెడ్డి కుమార్తె అత్తవారిల్లు ఆలంపురం దగ్గరనే. అలాగ సంజీవరెడ్డి గారికి ఆలంపురంతో అనుభంధం. శ్రీమతి లక్ష్మికాంతమ్మ పుట్టింటి వారికి సంజీవరెడ్డి వియ్యంకులకు పరిచయాలు మరియు వైరాలు వున్నవి. సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తాను అసెంబ్లీ లో అడుగు పెట్టాలనే కోరిక కలిగిన శ్రీమతి లక్ష్మికాంతమ్మ తన ప్రయత్నాలు మొదలెట్టారు. ఇదే సమయంలో శ్రీ చెన్నారెడ్డి గారి దృష్టిలో పడ్డ శ్రీ లక్ష్మికాంతమ్మ AP PCC టికెట్ ఆస్పిరంట్ లిస్ట్ లోకి ఎక్కారు. ఆ పేరును శ్రీ నీలం సంజీవరెడ్డి గారి దగ్గరకు తీసుకు వచ్చారు. అనేక తర్జన భర్జనల తరువాత ఖమ్మం టికెట్ ను ఆశిస్తున్న అభ్యర్థులలో శ్రీమతి లక్ష్మికాంతమ్మ ఒకరైనారు.

శ్రీ నీలం సంజీవరెడ్డి వర్గం రాష్ట్ర నాయకుల నుండి తిరిగి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు పై ఖమ్మం అసెంబ్లీని గెలిపించే గురుతర బాధ్యత అప్పగించ బడింది. మొదట ఏ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయం జరిగిందో శ్రీమతి తెళ్ళ లక్ష్మికాంతమ్మ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో అధిష్టానం  సూచించిన  శ్రీమతి లక్ష్మి కాంతమ్మ పేరును సత్యనారాయణరావు గారు కూడా ఆమోదించటం జరిగింది. ఈ సామాజిక వర్గం లో అప్పటి వరకు కాంగ్రెస్ లో ఎవ్వరు ప్రసిద్దులు కాదు. ఆ సామాజిక వర్గంలో అసెంబ్లీ స్థాయి ఎన్నికలలో నిలువబడే అభ్యర్థులు కాంగ్రెస్ లో  ఎవ్వరు లేరనే చెప్పవచ్చు.  

శ్రీమతి లక్ష్మికాంతమ్మ గొప్ప మేధావి. చెన్నారెడ్డి వర్గం తరఫున వెలుగులోకి వచ్చినా సంజీవరెడ్డి వర్గానికి ఏనాడు ధూరం కాలేదు. పైగా వారితోనే రాజకీయంగా మెలిగారు. తానుగా జిల్లాలో సొంత రాజకీయాలు చేయక పోవటం ఆమెకు ప్లుస్ పాయింట్. జిల్లా రాజకీయాలో తాను తన ముద్ర వేయాలని ప్రయత్నించక పోవటం తో శ్రీమతి ఇందిరాగాంధీతో విబేధాలు వచ్చే వరకు జిల్లాలో దీర్ఘ కాలం వున్నారు. 1969 తెలంగాణా ఉద్యమం చెన్నారెడ్డి నాయకత్వాన ఉవ్వెత్తున ఎగసిపడినా ఆమె అటు తొంగి చూడలేదు. ఎక్కువ మంది జిల్లా కాంగ్రెస్ నాయకులు  ప్రత్యేక తెలంగాణాకు అనుకూలం కాకపోవటంతో  1969 లో కుడా ఆమే MP గా విజయం సాధించింది. అప్పుడు తెలంగాణా మొత్తం మీద గెలిచిన కాంగ్రెస్ సీట్ ఇది ఒక్కటే.

శ్రీమతి రేణుకాచౌదరి ఖమ్మం జిల్లాలో తన రాజకీయ జీవిత ప్రారంభంలో శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి, శ్రీ శీలం సిద్దారెడ్డి ద్వారానే ఖమ్మం ఆడపడుచుగా, ఖమ్మం లోకసభ అభ్యర్థిగా అడుగు పెట్టినా ఆ తరువాత జిల్లా రాజకీయాలలో తల దూర్చటం, సొంత ముద్ర వేయాలనే తపన వల్ల శ్రీమతి లక్ష్మికాంతమ్మ లాగా స్థానం సంపాదించలేక పోయారు. స్థానికంగా రాజకీయంగా నష్టపోయారు. శ్రీమతి లక్ష్మి కాంతమ్మ రాజకీయ జీవితం ఖమ్మం జిల్లాలో  ప్రశాంతం గా రెండు దశాబ్దాలు సాగింది.

2. శ్రీ కోట పున్నయ్య.


విజయవాడ లో చదువు కొనే రోజులలో కాలేజీ ప్రెసిడెంట్ గా వెలుగు లోకి వచ్చి సికింద్రాబాద్ లో రైల్వేలో Commercial clerk గా ఉద్యోగ విధులలో ఉంటూ "All India depressed class League" రాష్ట్ర శాఖలో చురుకుగావున్న  శ్రీ కోట పున్నయ్య కూడా ఖమ్మం జిల్లా బయటి వ్యక్తి అయినా కూడా ఖమ్మం ASSEMBLY లో SC స్థానానికి అభ్యర్థిగా అయినాడు. ఆ రోజులలో దళితుల కోసం జగ్జీవన్రాం ఆధ్వర్యంలోని పై సంస్థతో పాటు శ్రీ బి.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీ మాత్రమే దేశం మొత్తంలో ఉండేవి. గంపలగూడెం రాజా శ్రీ కోటగిరి గోపాలరావు సంరక్షణలో పెరిగి పెద్దవాడైన శ్రీ కోట పున్నయ్య విజయవాడలో చదివే రోజులలో విద్యార్థి నాయకుడు. శ్రీ కోటగిరి గోపాలరావు ఆంద్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష స్థానంలో వుండటం శ్రీ పున్నయ్య  రాజకీయాలలో అడుగు పెట్టాతానికి దోహదం చేసింది.

1957 ఖమ్మం అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా వుండి ఎన్నికల రథ సారధి తానే అయినారు. వారి స్వంత జీప్ నే ప్రచార రథం గా ఉపయోగించారు.

ఒకసారి వారి జీప్ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులను తీసుకుని  బాణాపురం, కమలాపురం రహదారి పై సాయంకాల సమయంలో వెళ్ళు చుండగా అక్కడి కమ్యూనిస్ట్ కార్యక్తలు జీప్ ను వెళ్ళనీయమని  జీప్ కు అడ్డం తగిలి రోడ్ మీద పడుకున్నారు. పెండ్యాల సత్యనారాయణరావు గారు జీప్ స్టీరింగ్  వదలి జీప్ దిగి వాళ్ళ ఎదురుగా నిలుచుని "ఏమిరా మమ్మల్ని వేల్లానీయరా" అని బిగ్గరగా అనగానే "అయ్యా! మీరా?, మీరైతే వెళ్ళండి” అని ఆ కార్యకర్తలు దారి ఇచ్చిన సంఘటన మరువలేనిది. ఇంతకు ముందు వాళ్ళు అందరు ఆయన నాయకత్వం క్రింద వున్న వారే. ఆ గౌరవం వారికుంది. ఇలా నియోజక వర్గం లో చాలా చోట్ల జరిగాయి. ఆయన వ్యక్తిత్వమే, నాయకత్వ పటిమే  శ్రీమతి తేళ్ళ లక్ష్మి కాంతమ్మ విజయానికి చేరువ చేసింది. 

ఆనాటి నియోజక వర్గ పరిస్థితులను వివరిస్తూ శ్రీ కోట గురుమూర్తి తన అనుభవాలను ఏ వ్యాసకర్తతో పంచుకున్నారు. తాను అప్పుడు పదో తరగతి చదువు తున్నానని, పున్నయ్య గారికి ప్రచారంలో భాగం గా తను తన తోటి విద్యార్థులో కలసి సైకిల్ ర్యాలీతో గ్రామాలకు వెళ్లానని కొన్ని చోట్ల తమ వైరి వర్గం నుంచి ప్రతిఘటనలు వచ్చాయని, ఒకచోట తీసు కెళ్ళిన సైకిళ్ళ ను వదలి పారిపోయామని చెప్పారు. 

ఖమ్మం అసెంబ్లీలో సాంకేతికంగా శ్ర్తిమతి తేళ్ళ లక్ష్మికాంతమ్మ నే MLA గా గెలుపొందినా శ్రీమతి లక్ష్మికాంతమ్మ రాజకీయాలకు, అందునా ఖమ్మం జిల్లాకు కొత్త కావటంతొ నియోజక వర్గం రాజకీయం, అభివృద్ది కార్యక్రమాలు అన్ని పెండ్యాల సత్యనారాయణరావు గారే పర్య వేక్షించేవారు. 

ఖమ్మం/పాలేరు  అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్ధుల విజయాల గణాంకాలు..


1952 లో జరిగిన ఎన్నికలలో ఖమ్మం అసెంబ్లీలో ఓ.సి. స్థానంలో శ్రీ కర్నాటి కృష్ణయ్య, ఎస్.సి. స్థానంలో శ్రీ రెంటాల బాల గురుమూర్తి గెలుపొందారు. 

1957 అసెంబ్లీ ఎన్నికలలో ఓ.సి. స్థానంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి లక్ష్మికాంతమ్మ గెలుపొందారు. ఎస్. సి స్థానంలో కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ నామవరపు పెద్దన్న గెలుపొందారు.

1962 లో నియోజక వర్గ పునర్విభజనలో భాగంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవరగాన్ని పాలేరు మరియు ఖమ్మం గా విభాజించటంతో పాలేరు SC Reserved seat గా రూపాంతరం జరిగింది. ఖమ్మం అసెంబ్లీ స్థానం O.C. లకు కేటాయించ బడినది.

పాలేరులో 1962-1972 సంవత్సరం వరకు జరిగిన ముడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కత్తుల శాంతయ్య వరుస విజయాలను సొంతం చేసుకున్నారు.

1962 లో ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గంలో శ్రీ నల్ల మల గిరిప్రసాద్ (28,394) Congress అభ్యర్థి శ్రీ పర్చా శ్రీనివాసరావు (16,732) పై గెలుపొందారు. 

1967 లో సి.పి.యం. పార్టీ కి చెందిన శ్రీ మొహమ్మద్ రజబలి (30,344) కాంగ్రెస్ పార్టీ కి చెందిన శ్రీ శాకమురి సూర్య ప్రకాశరావు (20,820)  పై గెలుపొందారు. 

1972 లో సి.పి.ఐ కు చెందిన శ్రీ మొహమ్మద్ రజబలి (27,046) కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కమాల్ ఖాన్ (25,299), సి.పి.యం కు చెందిన బోజేడ్ల వెంకట నారాయణ (11,364) ల పై గెలుపొందారు.

3. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు.

ఖమ్మం జిల్లాలో రాజకీయ పునరేకీకరణల సమరం శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు V/S శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుగా జరిగింది. 

ఆ విభేదాలు ఎలా వుండేవంటే ఒకటే ఉదాహరణ. నేలకొండపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. అందులో జిల్లా నాయకులంతా వచ్చారు. అప్పటి పాలేరు సమితి అధ్యక్షులు సమావేశానికి అధ్యక్షత వహించారు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుకు ఆహ్వానం లేదు. ఆ సమావేశానికి అప్పటి రాష్ట్ర హోం శాఖా మంత్రి శ్రీ మందుముల నరసింహారావు వచ్చారు. 

సమావేశం ప్రారంభించే ముందు సమావేశానికి వచ్చిన పరిసర గ్రామాల ప్రజలలో కొందరు పెండ్యాల సత్యనారాయణరావు గారు సమావేశానికి రాకుంటే మేము ఈ సమావేశం జరుగనీయమని గొడవ చేశారు. ఈ రోజుల్లో అవుతే ఆక్కడున్న హోం మంత్రి SP ని పిలిచి వాళ్ళందరిని అర్రేస్ట్ చేసి సమావేశం జరుపుకొనే వారు. కానీ అలా జరుగలేదు. విషయం అర్ధమైన రాష్ట్ర హోం మినిస్టర్ శ్రీ మందుముల నరసింహారావు స్వీయంగా శ్రీ పెండ్యాల ఇంటికి వెళ్లి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ను సమావేశానికి తీసుకుని వెళ్లారు. నైజాం పై జరిగిన ఉద్యమాల రోజులలో  శ్రీ మందుముల నరసింగరావు ఆంద్ర మహాసభలో రాష్ట్ర నాయకులు. నిజామాబాద్ లోని ఇందుర్తిలో జరిగిన 6 వ ఆంద్ర మహాసభ కు అధ్యక్షులు.  శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఉద్యమాల చరిత్ర ఆయనకు తెలుసు. ఎవ్వరిని ఎలా గౌరవించాలో తెలుసు.

ఖమ్మం జిల్లా ఏర్పడిన తరువాత రహదారుల నిర్మాణం, డొంకల సర్దుబాటు కార్యక్రమాల నేపధ్యంలో నేలకొండపల్లి నుండి తిరుమలాపురం ద్వారా బోడులబండ కు అటునుండి కూసుమంచికి ప్రభుత్వం తరఫున వచ్చిన రహదారి నిర్మాణ ప్రతిపాదించిన మార్గాన్ని ప్రజలు వ్యతిరేకించారు. బోడులబండ పట్వారి గారి  సూచన మేరకు  శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు  ఆ ప్రతిపాదనను ప్రభుత్వ ప్రతిపాదనలలో చేర్చారు.

ఆ ప్రతిపాదనను మార్చమని ప్రజల విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టటంతో అక్కడి  ప్రజల కోరిక మేరకు ఖమ్మం మరియు నేలకొండపల్లి విద్యార్థుల శ్రమదానంతో, సమీప గ్రామ యువకుల సహకారంతో  శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు రహదారి నిర్మాణం గావించారు. ఆ శ్రమదానం కార్యక్రమం 30  రోజులపాటు జరిగింది. ఆ రోజులలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు కు  ప్రభుత్వ వర్గాలలో పలుకుబడి తిరుగు లేనిదీ.

జిల్లాలో రాజకీయ పునరేకీకరణల ఘట్టం 1956 లో శ్రీ నీలం సంజీవరెడ్డి దూతగా శ్రీ కళా వెంకట్రావు రంగ ప్రవేశం మరియు ప్రమేయంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపిక ముందుకు కదిలి, 1958 FEB లో జరిగిన జిల్లా పంచాయత్ రాజ్ కాన్ఫరెన్స్ తో ఒక స్వరూపాన్ని సంతరించుకుంది. 1957 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మం మరియు మధిర లలో జరిగిన ఎన్నికల సభలలో శ్రీ నీలం సంజీవరెడ్డి పాల్గొని జిల్లా నాయకులతో ప్రత్యక్ష సంబంధాల ఏర్పరచుకొన్నారు.

1958 లో పాలేరు బ్లాక్ Development committee vice president గా వున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు అదే సంవత్సరంలో జిల్లా సర్పంచ్ ల సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షులు గా ఎన్నికయ్యారు. జిల్లా సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పంచయత్ రాజ్ కాన్ఫరెన్స్ ను ఖమ్మంలోని వర్తక సంఘభవనంలో 1958, FEBRUARY 8 న  నిర్వహించారు. ఆ సమావేశం లో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయత్ రాజ శాఖా మాత్యులు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర PCC PRESIDENT శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, శ్రీ జలగం వెంగళరావు, శ్రీ శీలం సిద్దారెడ్డి పాల్గొన్నారు. 

శ్రీ జలగం వెంగళరావు అప్పుడే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినారు. స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి MLC గా శ్రీ శీలం సిద్దారెడ్డిని నిర్ణయం చేశారు. ఆయన MLC గా విజయం సాధించారు. ముందు జరుగబోయే ఖమ్మం జిల్లా పరిషద్ ఎన్నికలకు ఒక ప్రణాళికను అప్పుడే సిద్దం చేశారు. ఆ ప్రణాళికను అనుసరించే శ్రీ జలగం వెంగళరావు జిల్లాలో ప్రప్రధమ జిల్లా జిల్లా పరిషద్ అధ్యక్షుడు అయినారు.


పాలేరు పంచాయత్ సమితి ఎన్నికలు.


1959 సంవత్సరం ఖమ్మం జిల్లాలో కీలక మైనది. అప్పుడే జిల్లాలో పంచాయత్ సమితి, జిల్లా పరిషద్ ఎన్నికల నగారా మ్రోగింది. కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావుగారి వర్గం కమ్యునిస్ట్ పార్టీ తో కలిసి పోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ పాలేరు లో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి సారధ్యంలో ఒంటరిగా సమరం సాగించింది.

పాలేరు పంచాయత్ సమితి ఎన్నికలలో తన పిన్నిగారి కుమారుడైన శ్రీ రావులపాటి సత్యనారాయణరావు ను  శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు రంగంలోకి దింపారు. శ్రీ రావులపాటి తన స్వగ్రామంలో గ్రామ పంచాయత్ సర్పంచ్ గా కమ్యునిస్ట్ పార్టీ కి చెందిన శ్రీ యనమద్ది వెంకయ్య విజయానికి సాయం చేసి యున్నారు. ఆ రుణాన్ని శ్రీ యనమద్ది వెంకయ్య సమితి ఎన్నికలలో శ్రీ రావులపాటి సత్యనారాయరావుకు సహకారాన్ని అందించటం వల్ల తీర్చుకున్నారు. 

ఆ నాటి పాలేరు సమితి ఎన్నికలలో భందుత్వాలు పనిచేయలేదు. కాంగ్రెస్ తరపున సమితి ప్రెసిడెంట్ పదవికి పోటిచేసిన శ్రీ ఎల్లంపల్లి రామచంద్రయ్య శ్రీ యనమద్ది వెంకయ్యకు మామ అయినా శ్రీ యనమద్ది వెంకయ్య ఆయనకు ఓటు వెయ్యలేదు. శ్రీ రావులపాటి సత్యనారాయణరావుకు వల్లభి సర్పంచ్ శ్రీ ఐతరాజు రామారావు బంధువు అయినా శ్రీ రావులపాటి సత్యనారాయణరావుకు ఆయన ఓటు వేయలేదు. శ్రీ ఎల్లంపల్లి రామచంద్రయ్య, శ్రీ దండా పుల్లయ్యలు మాజీ కమ్యునిస్ట్ లు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుతో పాటు కమ్యునిస్ట్ పార్టీలో పనిచేశారు. 

ఈ ఎన్నికలలో ప్రత్యేకత ఏమిటంటే సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికైన శ్రీ రావులపాటి సత్యనారాయణరావు (ముదిగొండ) మరియు వైస్ ప్రేసిడెంట్ గా ఎన్నికైన శ్రీ కర్నాటి కృష్ణయ్య (కొత్త కొత్తూరు) గాని సర్పంచ్ లు కాదు. కో-ఆప్షన్ మెంబెర్స్. బొమ్మకంటి వర్గం మరియు కమ్యునిస్ట్ లు కలసి పోటిచేసిన ఆ వర్గం కేవలం ఒక్క ఓటు తేడాతోనే  గెలిచారు.

ఖమ్మం పంచాయత్ సమితి ఎన్నికలు.


పాలేరు సమితి లాగానే బొమ్మకంటి వర్గం మరియు కమ్యునిస్ట్ పార్టీ వారు ఖమ్మం సమితిలో కుడా కలిసే పోటి చేశారు. అక్కడ కమ్యునిస్ట్ పార్టీకి సమితి అధ్యక్ష పదవి మరియు ఉపాధ్యక్ష పదవి బొమ్మకంటి వర్గానికి ఇచ్చారు. సమితి ప్రెసిడెంట్ గా కమ్యునిస్ట్ పార్టీకి చెందిన శ్రీ బోజేడ్ల వెంకట నారాయణ(రామన్నపేట)  మరియు వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ పోట్ల వెంకటయ్య(కొక్కిరేణి) అయినారు. ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అభ్యర్థు లిద్దరూ సొంత బావ బావ మరుదులు కావటం విశేషం.

ప్రప్రధమ ఖమ్మం జిల్లా పరిషద్ ఎన్నికలు.


1959 లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వున్న రెండు వర్గాలు జిల్లా పరిషద్ పీటం దక్కించు కోవటానికి తమ శక్తి యుక్తుల నన్నిటిని ధారపోసినవి. పాలేరు మరియు ఖమ్మం పంచాయతి సమితుల ఎన్నికలు జిల్లాలోని వర్గ రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. ఇదే తరహా రాజకీయాన్ని జిల్లా పరిషద్ ఎన్నికలలో ప్రయోగించారు. ఆ సమయంలో ప్రక్కనున్న నల్గొండ జిల్లాలో కమ్మ్యునిస్ట్ పార్టీ ఆ జిల్లా పరిషద్ ను చేజిక్కించు కొంది.

ఖమ్మం జిల్లా పరిషద్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా జరిగింది. బొమ్మకంటి వర్గం మరియు కమ్యునిస్ట్లు కలిసి  ఏ సూత్రం ప్రకారం CO-OPTION MEMBERS ఎన్నికతో పాలేరు పంచాయత్ సమితిని సాధించుకొన్నారో  ఆ సూత్రాన్నే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుసరించింది. పొరుగు జిల్లాలకు చెందిన M.P మరియు MLA లు ఆరుగురిని  ఖమ్మం జిల్లా పరిషద్ లో ఓటు హక్కును కలిపించి సభ్యులుగా చేశారు. ఆ మెంబెర్స్ ఓటు హక్కుతో శ్రీ జలగం వెంగళరావు ను CO-OPTION MEMBER గా గెలిపించి  చైర్మన్ గా ఎన్నిక చేశారు. ఆ నాటి నుండి జిల్లా రాజకీయ ముఖ చిత్రం సంపూర్ణంగా మారిపోయింది.

వేమ్సూర్ నుంచి శ్రీ జలగం వెంగళరావు, మధిర నుండి శ్రీ శీలం సిద్దారెడ్డి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, శ్రీమతి తేల్ల లక్ష్మికాంతమ్మ, కోట పున్నయ్య, హీరాలాల్ మోరియా, ఒక ట్రూప్ గా జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహణా కార్యకలాపాల కోసం, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికా అమలుకోసం రాష్ట్ర స్థాయి అధికార, అనధికారుల కలిసేందుకు  అందరు కలసి చాలా కాలం తిరిగేవారు. ఒకే మాట, ఒకే బాట గా వుండేవారు.

1958 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఖమ్మం వర్తక సంఘ భవనంలో జరిగిన జిల్లా పంచయత్రాజ్ కాన్ఫరెన్స్ ఫోటో ఇది. ఈ సమావేశానికి రాష్ట్ర పంచాయత్ రాజ్ మంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి వచ్చారు. చిత్రంలో మాట్లాడుతున్న వారు ఖమ్మం జిల్లా సర్పంచ్ ల సంఘం ప్రెసిడెంట్ శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు. ముందు వరుసలో ఎడమ నుండి కుడికి వరుసగా ఖమ్మం మునిసిపల్ చైర్మన్ శ్రీ చిర్రావురి లక్ష్మినరసయ్య, శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్  శ్రీ జలగం వెంగళరావు, మధిర MLA శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీశ్రీ శీలం సిద్దారెడ్డి వున్నారు. వెనుక వరుసలో కుడి నుండి ఎడమకు  వరుసగా ఖమ్మం MLA శ్రీమతి లక్ష్మి కాంతమ్మ, శ్రీ కోట పున్నయ్య, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్  శ్రీ గెల్లా కేశవరావు వున్నారు.


శ్రీ జలగం వెంగళరావు, శ్రీ శీలం సిద్దారెడ్డి తరువాత ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు శ్రీ లక్కినేని నరసయ్య చేతికి వచ్చాయి.

ఇంతలో కాలంలో మార్పులు. మనస్తత్వాల్లో మార్పులు.  చల్లగా సాగుతున్న కాంగ్రెస్ ఉమ్మడి కుటుంబంలోకి ఎవ్వరో ప్రవేశించారు.  ఏవో—ఏవేవో—విబేధాలు.  నాయకుల మధ్యన దూరం పెరిగింది.  

ఫలితాలేమిటో.. తదుపరి వ్యాసంలో.

                                                                       .....PENDYALA VASUDEVARAO.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Friday, August 3, 2018

మా వరంగల్/ఖమ్మం జిల్లాలో ప్రధమ ధశాబ్ధంన్నర ఎన్నికల రాజకీయం.

 58. (ఖమ్మం చరిత్ర-6) 

మా వరంగల్/ఖమ్మం జిల్లా లో ప్రధమ దశాబ్ధం ఎన్నికల రాజకీయం.


అది 1949 సంవత్సరం నవంబెర్ 26 వ తేది, వరంగల్ పట్టణంలో అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల సారధ్యం లో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  ఆ సమావేశానికి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నేత్రుత్త్వం వహించారు. సర్దార్ వల్లభాయి పటేల్ ముఖ్యఅతిధిగా వచ్చారు. విశాలాంధ్ర ఏర్పాటుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రజల మద్దతు సంపాదించటమే ఆ సమావేశ ముఖ్యోద్దేశ్యం. సహజం గానే హైదరాబాద్ లో సార్వత్రిక ఎన్నికలొస్తే ఎవ్వరు ముఖ్య మంత్రి అనే చర్చకూడా జరుగుతుంది. అంతర్గతంగా ఆ సమాలోచనలు కుడా జరిగాయి.

ఎన్నికలు జరుగుతే వరంగల్/ ఖమ్మం నుండి ముఖ్యమంత్రి కాండిడేట్ స్థాయి వున్న నాయకుడు కాంగ్రెస్ నుండి శ్రీ జమలాపురం కేశవరావు వున్నారు. కాంగ్రెస్ పార్టీ పై నిషేధం తొలగిన తరువాత ప్రప్రధమంగా శ్రీ జమలాపురం కేశవరావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1946-1949 వరకు పనిచేశారు. విశాలాంధ్ర భావనకు శ్రీ జమలాపురం వ్యతిరేకించాడు. పార్టీ లో ఒంటరి అయినాడు. అప్పుడే ఆయనను రాజకీయం గా అణగ దోక్కటానికి పావులు కదిపటం ప్రారంభం అయినది.

1949 హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలలో శ్రీ జమలాపురం కేశవరావు గారు ఓటమిచెందారు.

అప్పుడే వివిధ నాయకుల మధ్యన ముఖ్యమంత్రి పదవిపై ఆశలు మొగ్గ తొడిగినవి. ఎవ్వరి లాబియింగ్ లు వారు చాపక్రింద నీరులా ప్రారంభించారు. 1952 సంవత్సరం లో ప్రధమ సారస్వత ఎన్నికలు వచ్చేసరికి ఈ రాజకీయాలకు హైదరాబాద్ రాష్ట్రంలో ఒక  స్వరూపము సంతరించుకుంది.

శ్రీ జమలాపురం కేశవరావు గారికి ఆయన సొంత నియోజకవర్గం మధిర అసెంబ్లీ సీటు దక్కకుండా శక్తి వంచన లేకుండా కృషిచేశారు. వారిలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల హస్తాలున్నవి. కమ్మ్యునిస్ట్ ల కంచుకోట నర్సంపేట్ ఏరియాలోని పాకాల అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఆయనకు కేటాయించారు. వారు వుహించినట్లే ఆయన ఎన్నికలలో ఓడిపోయారు.
శ్రీ జమలాపురం కేశవరావు గారి అడ్డు తొలగబోతున్నదనే  సంకేతాలను అందుకున్న ఖమ్మం ఏరియా కాంగ్రెస్  నాయకులు హైదరాబాద్ రాష్ట్ర  ముఖ్య మంత్రి పదవి పై కన్నేశారు. విశాలాంధ్ర ఏర్పడితే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారే ముఖ్య మంత్రి అని అధిష్టానానికి లోగా వారు విన్న వించి ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీని వర్గాలు లేకుండా ఏనాడు వూహించ లేము. కాంగ్రెస్ పార్టీ పుట్టిన  వెంటనే అవి మొదలు అయ్యాయి. ఉదాహరణకు మహాత్మా గాంధి అభీస్టానికి వ్యతిరేకంగా శ్రీ నేతాజీ సుభాష్ బోస్ ను కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడి గా కాంగ్రెస్ఎ పార్టీ సభ్యులు ఎన్నుకొంటే, అధ్యక్షుడిగా గెలిచిన నేతాజీ సుభాష్చంద్ర బోస్  రాజీనామా చేసి పార్టీ నుండి బయటకు వెళ్ళేదాకా మహాత్మా గాంధీ ఊరుకోలేదు. అప్పుడు నేతాజీ పై ఆంధ్రాకు చెందిన శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోయారు.

ఆంద్ర రాష్ట్రం ఏర్పడటానికి ముందు నుండే ఆంధ్రా నాయకుల మధ్యన వర్గాలు ప్రారంభం అయ్యాయి. ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం ఏర్పడి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన తరువాత  మద్యపాన నిషేధం అమలును సాకుగా చూపి ప్రకాశం గారిని పదవి నుండి దించేశారు. అదే అదనుగా రెడ్డి సామాజిక వర్గమంతా అధికారం చేజిక్కిన్చుకోవటానికి పావులు కదిపారు. ఫలితంగా శ్రీ బెజవాడ గోపాలరెడ్డి ముఖ్య మంత్రిగా, శ్రీ నీలం సంజీవ రెడ్డి ఉప ముఖ్యమంత్రి గా అయ్యారు.

అక్కడ కులాల విభజన స్పష్టం గా కనబడుతుంది. అది మారిన ఆంధ్రా రాజకీయం.  

చరిత్ర గురించి మాట్లాడాలంటే కులాల గురించి మరియు వాటి ఉప కులాల గురించి కూడా చర్చించకుండా ఉండలేము. బ్రిటిష్ ఇండియాలో అయినా, ఆంధ్రాలో అయినా, హైదరాబాద్ రాష్ట్రంలో అయినా ఉద్యమాలలో అగ్ర వర్ణం వాళ్ళు, ముఖ్యం గా బ్రాహ్మిన్స్ అగ్ర భాగంలో వుండే వారు. వాళ్ళకున్న వేలాది ఎకరాల భూమిని, నెలవారీ వచ్చే వేలరూపాయల ఆదాయాన్ని త్రుణ ప్రాయం గా త్యాగం చేసి ఉద్యమాలు ప్రారంభించారు. బలహీన వర్గాలకోసం, అణగారిన ప్రజలకోసం ఉద్యమించారు.  నైజాంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు అగ్ర వర్ణ భూస్వాములే. ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ యే. వారు తమ ఆస్తి మొత్తాన్ని ఉద్యమంలో పోగొట్టుకున్నారు.

బ్రాహ్మిన్స్ లో వైదీకి, నియోగి ఫీలింగ్స్ ఎక్కువగా వున్న రోజులవి.  వరంగల్ జిల్లా విషయానికి వస్తే  కాంగ్రెస్ పార్టీ లో నియోగులే అగ్ర భాగాన వుండే వారు. వైదీకులు, నియోగులు మరియు కమ్మ సామాజిక వర్గం వారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో వుండేవారు.

1953 Decemberలో States Re organisation Committee ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫలితమ గా  విశాలాంధ్ర ఏర్పాటుకు భారత ప్రభుత్వం లో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపబోతున్నదనే విషయం స్పష్టం కాగానే ప్రభుత్వ ఏర్పాటుకు అటు ఆంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లోని వర్గాలు మరియు ఇటు హైదరాబాద్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ లోని వర్గాలు  అప్రమత్తం అయినాయి. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి పావులు కదిపినవి. ప్రధమమం లో పండిత జవహర్లాల్ విశాలాంధ్రకు వ్యతిరేకమైనా తరువాత ఆయనను ఒప్పించారు.

వరంగల్ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ లో శ్రీ జమలాపురం కేశవరావు ను అణగత్రొక్కే చర్యలు ముమ్మరం అయినై. ఆయన వ్యతిరేక వర్గం శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు ను ఆశ్రయించినవి. శ్రీ టంగుటూరి ప్రకాశం పంచన చేరాయి. ఆయనే ముఖ్య మంత్రి అని ప్రచారం లో పాల్గొన్నవి. పరోక్షంగా ఆ పదవి తమకే కావాలని ఆలోచన.  శ్రీ జమలాపురం ఉద్యమ పంధా మనిషే తప్ప రాజ్యాధికారం కోసం తపించే వ్యక్తి కాదు. ఈ మనస్తత్వాన్ని ఆసరాగా పావులు వేగంగా కదిపినవి ఆ వర్గాలు.

అటు ఆంద్ర రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రిగా వున్న నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్త రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తన రాజకీయ చదరంగపు ఎత్తులను  ప్రారంభించారు. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు వ్యతిరేక వర్గంను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేశారు.

శ్రీ కళా వెంకట్రావు మద్రాస్ ప్రెసిడెన్సీలో కాబినెట్ మినిస్టర్ గా సేవలందించిన వ్యక్తి. ఆంధ్రా కాంగ్రెస్ లో పెద్ద నాయకుడు.  ప్రత్యేక  ఆంధ్ర రాష్ట్ర  ఏర్పాటుకు మద్రాస్  రాష్ట్రం ఏర్పాటు చేసిన కమిటీ లో  కీలకమైన వ్యక్తి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీ గా సేవలందించిన వ్యక్తి. నైజాం వ్యతిరేక పోరాటం రోజులలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ నాయకులందరికీ విజయవాడ షెల్టర్ జోన్. కాంగ్రెస్ పార్టీ  నైజాం లో ఆవిర్భవించక ముందే ఆ పార్టీ పై  నైజాంలో నిషేధించినందువల్ల  కమ్యూనిస్ట్ లతో  కలిసి ఆంద్ర మహాసభ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ  నాయకులు పాలు గొనటం వల్ల ఇరు ప్రాంతాల నాయకులకు మంచి పరిచయాలు, సంభంధాలు ఉండేవి.

నైజాం విమోచనం తరువాత శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు కమ్యూనిస్ట్ పార్టీకి రాజీనామా చేసి స్వగ్రామానికి వచ్చిన తరువాత అప్పటి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ రామానంద తీర్ధ మరియు శ్రీ కళా వెంకటరావు ఆయనపై కాంగ్రెస్ పార్టీ లోకి రమ్మని వత్తిడి చేశారు. ఆయన సిద్ధాంత పరంగా నైజాం ఇండియాలో విలీనాన్ని వ్యతిరేకించిన కమ్యూనిస్ట్ పార్టీని విభేదిన్చాడే గాని పార్టీ పై ఆయనకు వ్యతిరేకత ఏమి లేదు. చాలా కాలం వరకు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు ఎటువంటి నిర్ణయము తీసుకోన లేదు. శ్రీ కళా వెంకట్రావు గారు నేలకొండపల్లి కి రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళారు. ఆ విధంగా వారి సంభంధాలు ఉండేవి. ఇక్కడి వారికి ఆయన ఎవ్వరో తెలియనందు వల్ల ఎవ్వరు గుర్తు పట్టే వాళ్ళు కాదు. ఈ సంభంధాలు తెలిసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు కొందరికి పెండ్యాల సత్యనారాయణ గారి పొడ గిట్టేది కాదు. జమలాపురం కేశవరావు గారితో పెండ్యాల సత్యనారాయణరావు గారికున్న ఆత్మీయ అనుభంధం వారికి తెలియనిది కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ లోకి వస్తే తమకు రాజకీయ ప్రత్యర్ధి అవుతాడని వారి భయం. కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆయన నాయకత్వ పటిమను చూసారు. జిల్లాలో "ఆయన పేరు చెబితే పిట్టలు కుడా నీళ్ళు తాగేవి కాదు అని పేరు. ఆయన పేరు చెబితే శత్రువులకు సింహ స్వప్నం". ఈ విషయం ఎన్నో సందర్భంలలో శ్రీ దాశరధి రంగాచార్య చెబుతుండేవారు.

చివరకు 1956 లో శ్రీ నీలం సంజీవరెడ్డి దూతగా శ్రీ కళా వెంకట్రావు గారు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారితో జరిపిన ఆంతరంగిక భేటీలో ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థుతుల బేరీజు వేసి జరిగిన నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల నిర్ణయం జరిగింది. అన్ని వర్గాలను కలుపుకుని పోయే విధం గా నిర్ణయం జరిగింది. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రప్రధమంగా జరిగిన ఎన్నికల అనంతరం శ్రీ కళా వెంకట్రావు గారు నీలం సంజీవరెడ్డి గారి మంత్రి వర్గంలో కాబినెట్ హోదాలో రాష్ట్ర రెవిన్యూ మరియు ఆర్ధిక శాకా మాత్యులు గా పనిచేశారు.

నైజాం వ్యతిరేక ఉద్యమం రోజులలో వరంగల్ జిల్లా ఆంద్ర మహాసభ అధ్యక్ష, కార్యదర్శులుగా కలిసి పనిచేసినందువల్ల శ్రీ జమలాపురం కేశవరావు గారికి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారికి  సత్సంభందాలు ఉండేవి. సహజంగానే కేశవరావు గారికి ఆప్తుడైనందున కేశవరావు గారి వ్యతిరేక  వర్గం వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శ్రీ సత్యనారాయణరావు పై రాజకీయ దాడికి పావులు కదిపారు. వాటి ఫలితాలె జిల్లా రాజకీయాలను ప్రభావితం చేశాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత 1957 లో జరిగిన సారస్వత ఎన్నికల ఎన్నికల అభ్యర్థుల ఎంపిక తదనంతర పరిణామాల ఫలితం గా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో నూతన నాయకత్వ ఆవిర్భావానికి హేతువు అయినవి.జిల్లా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

ఖమ్మం జిల్లా ఏర్పడిన నాటినుంచి జరిగిన పార్లమేంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ జిల్లా రాజకీయ పరిణామ క్రమాన్ని, ఆయా సమయాల్లో ప్రజల రాజకీయ భావాలను తేట తెల్లం చేస్తాయి.

మొదటి మూడు లోకసభ నియోజకవర్గం ఎన్నికలు.
ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో 1952 ఎన్నికలలో PDF పేరుతో పోటీచేసిన  కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ టి.బి.విట్టలరావు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గడియారం కృష్ణారెడ్డి పై 72.000 ఓట్ల తేడాతో గెలుపొందారు. సోషలిస్ట్ అభ్యర్ధి శ్రీ దేవులపల్లి రామానుజ రావు కు 16,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ  ఎన్నికలు హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినవి.

1957 ఎన్నికలలో ఖమ్మం లోకసభకు తిరిగి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ టి.బి.విట్టలరావు కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ కొలిపాక కిషన్ రావు  పై కేవల నాలుగు వేల నాలుగు వందల ఓట్లతో గెలుపొందాడు. ఖమ్మం జిల్లా ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎన్నికలు యివి.

1962 సంవత్సరం లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి  శ్రీమతి లక్ష్మికాంతమ్మ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ టి.బి.విట్టలరావు పై 17,000 ఓట్ల ఆధిక్యం తొ  గెలుపొందారు.

1964 లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ CPI, CPM లు గా విడిపోవటంతో తన ప్రాభవాన్ని తదుపరి ఎన్నికల రణరంగంలో చూప లేకపోయినవి. కాంగ్రెస్ అభ్యర్థులే వరుస విజయాలు సాధించారు.

అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల స్వరూపం.
అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే ఖమ్మం జిల్లా ఏర్పడనప్పుడు ఖమ్మం ప్రాంతంలో  1952 సంత్సరములో నాలుగు, 1957 లో ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండేవి. మొదటి రెండు ఎన్నికలలో ఖమ్మం మరియు ఎల్లందు అసెంబ్లీ నియోజక వర్గాలు ద్విసభ్య నియోజక వర్గాలుగావుండేవి (ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక OC, ఒక SC అభ్యర్థిని, ఎల్లందు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక OC, ఒక ST అభ్యర్థిని ఎన్నుకోవలసి వుండేది).  1962 లో అసెంబ్లీ ఏడు నియోజక వర్గాలు గా పెరిగినవి. 1978 నుండి తొమ్మిది నియోజక వర్గాలుగా మారినవి. 2009 లో అవి పది నియోజక వర్గాలయినవి.

మొదటి మూడు అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికలు.

 1952 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లలో కమ్యూనిస్ట్ అభ్యర్ధులే గెలిచారు. ఖమ్మంలో శ్రీ కర్నాటి కృష్ణయ్య, ఎల్లందులో శ్రీ కె. ఎల్. నరసింహారావు, మధిరలో  శ్రీ కొండబోలు వెంకయ్య, వేమ్సూర్ లో శ్రీ కందిమళ్ళ రామకృష్ణారావు (అశ్వారావ్ పేట బాబు) లు PDF పేరిట గెలుపొందారు. ఖమ్మం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన్ నాయకులంతా ఓటమి చెందారు. ఓటమి చెందిన వారిలో సర్వశ్రీ జమలాపురం కేశవరావు (ఈయన వరంగల్ ప్రాంతం పాకాలలో  పోటిచేశారు), మాడపాటి రామచంద్రరావు (మధిర అసెంబ్లీ---మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని ఏరియాలు కలిగిన నియోజక వర్గం), కొలిపాక కిషన్ రావు (ఖమ్మం అసెంబ్లీ---ప్రస్తుత పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజక ప్రాంతాలు), బొమ్మకంటి సత్యనారాయణరావు (వేమ్సూర్ అసెంబ్లీ --వైరా, తల్లాడ, కల్లూరు, లంకపల్లి, వేమ్సూర్ ప్రాంతాలు నియోజక వర్గంలో వున్నవి) ఉన్నారు.  

1957 అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ ముఖ చిత్రం మారింది. కాంగ్రెస్ఖ పార్టీ విజయధంకా మ్రోగించింది. ఖమ్మం OC స్థానం, మధిర, వేమ్సూర్, పాల్వొంచలలో కాంగ్రెస్ అభ్యర్థులు మరియు ఎల్లందు OC, ST స్థానాలు మరియు ఖమ్మం SC స్థానంలలో  కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు  గెలుపొందారు.

1962 అసెంబ్లీ ఎన్నికలో ఖమ్మం(శ్రీ నల్లమల గిరిప్రసాద్), పాల్వోంచ, బూర్గంపాడు మరియు ఎల్లందు(శ్రీ K.L.నరసింహారావు) నియోజక వర్గాలలో కమ్యూనిస్ట్ అభ్యర్ధులే గెలుపొందారు. మిగతా పాలేరు(S.C) శ్రీ కత్తుల శాంతయ్య, మధిర (శ్రీ దుగ్గినేని వెంకయ్య). వేంసూరు(శ్రీ జలగం వెంగళరావు) నియోజక వర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఖమ్మం నియోజక వర్గంలో కమ్యూనిస్ట్ అభ్యర్థి శ్రీ నల్లమల గిరిప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ పర్చా శ్రీనివాసరావు పై గెలుపొందారు.

మొదటి మూడు అసెంబ్లీ ఎన్నికలలో వరుస విజయాలను సాధించిన కమ్యూనిస్ట్ అభ్యర్థి శ్రీ K.L.నరసింహారావు మాత్రమే. అప్పటి వరకు వరుస విజయాలను నమోదు చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్దులుకుడా ఎవ్వరు లేరు.

1964 సంవత్సరంలో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ  CPI, CPM లుగా  చీలి పోవటం తొ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సమీకరణ లలో మార్పులు సంభవించాయి. 1967 మరియు ఆ తరువాత జరిగిన ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల చరిత్ర మహాభారతమంత వుంది. ఎత్తులు, పై ఎత్తులు రాజకీయ చదరంగాలే. సిద్ధాంత ప్రభావాలు ఏమీలేవు. 
క్రింద వున్న ఫోటో జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపన కార్య క్రమం. చిత్రం లో జిల్లా కాంగ్రెస్ నవ సారధులు వున్నారు. శంకుస్తాపనా కార్య క్రమాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డి చేశారు. మెడలో దండతో వున్న వారు శ్రీ సంజీవరెడ్డి. ఆయనకు కుడి వైపున శ్రీ జలగం వెంగళరావు, ఎడమవైపున శ్రీ శీలం సిద్దారెడ్డి వున్నారు. వెంగళ రావు గారికి కుడివేపునుండి వరుసగా సర్వశ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, J.V. నరసింగరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట పున్నయ్య, పెండ్యాల సత్యనారాయణరావు, గోగినేని సత్యనారాయణ, హీరాలాల్ మోరియా వున్నారు.
శ్రీ శీలం సిద్దారెడ్డి గారికి ఎడమ వయిపున సర్వశ్రీ జలగం కొండలరావు, ఎల్లంపల్లి రామచంద్రయ్య, లక్కినేని నరసయ్య, కొలిపాక కిషన్రావు  ఇతరులు వున్నారు.



మొదటి సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి వేమ్సూర్, ఖమ్మం మరియు మధిర అసెంబ్లీ నియోజక వర్గాలు ప్రత్యేకతను కలిగి వున్నాయి.  

ఆ  నియోజక వర్గాల విశ్లేషణ వచ్చే వ్యాసం లో..

                  .......PENDYALA VASUDEVARAO.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Monday, July 9, 2018

నైజాం సంస్థానంలో CPI ఆవిర్భావం -- పరిణామాలు.

57. (ఖమ్మం చరిత్ర-5) 

నైజాం సంస్థానంలో  CPI పార్టీ ఆవిర్భావం - తదనంతర పరిణామాలు.


CPI పార్టీ బ్రిటిష్ ఇండియాలో 1925 సంవత్సరంలో కాన్పూర్లో అధికారికంగా ప్రారంభించ బడినది. అంతకుముందు తాష్కెంట్లో 1920 సంవత్సరంలో పార్టీమేనిఫెస్టోను తయ్యారుచేశారు. CPI వ్యవస్థాపకులు  శ్రీ మానవేంద్ర నాథరాయ్ అనే విషయం గమనార్హం.

1934 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగం అయిన ఆంధ్రఏరియాలో CPI పార్టీ ఆంధ్ర ప్రొవిన్సియల్ కమిటీ పేరిట ఆవిర్భవించింది. 1940 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో కమ్యునిస్ట్ పార్టీని నిషేధించారు. 1939 సంవత్సరంలో నైజాం సంస్థానంలో CPI పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో నైజాంకు వ్యతిరేకంగా గ్రంధాలయోద్యమంతో పాటు  1). కామ్రేడ్స్ అసోసియేషన్, 2), ఆంద్ర మహాసభ, 3). మహారాష్ట్ర పరిషద్ మరియు 4). వందేమాతరం పేరిట కార్యక్రమాలు నడుస్తుండేవి. వీటిలో గ్రామీణ ప్రాంతాలలో ఆంద్రమహాసభ కార్యక్రమాల ప్రభావం ఎక్కువగా వుండేది. ఆంద్రమహాసభలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, కామ్రేడ్స్ అసోసియేషన్ లో శ్రీ ముఖ్దూం మొహియుద్దీన్, వందేమాతరంలో శ్రీ సర్వదేవభట్ల రామనాధం లాంటి సోషలిస్ట్ ఆలోచనా విధానం కలిగిన యువకులు చురుకుగా వుండేవాళ్ళు.

ఆంధ్రాలో Communist Partyపై నిషేధం విధించి వుండటంవల్ల మునగాల పరగణాలో Under Ground లో వున్న శ్రీ చండ్ర రాజేశ్వర రావు వీళ్ళతో Touch లో ఉండేవారు. ఆంద్ర మహాసభలో చురుకుగా వున్ననల్లగొండ జిల్లాకు చెందిన  శ్రీ రావి నారాయణరెడ్డి అప్పుడు మితవాదిగానే ఉండేవారు. పార్టీ ఆవిర్భవించిన తరువాత కొంతకాలానికి పార్టీలో ప్రవేశించారు. దాదాపు ఆ సమయంలోనే పై చదువులు ముగించుకొని వచ్చిన శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావు తను ఫుల్ టైం వర్కరుగా  పనిచేయటాని ఆంధ్రా కమ్యునిస్ట్ ప్రొవిన్సియల్ కమిటీకి అనుమతికై దరఖాస్తు చేసి ఉన్నారు.

అప్పుడు శ్రీ చండ్ర రాజేశ్వరరావు బ్రిటిష్ ఇండియాకు చెందిన క్రిష్ణాజిల్లా Communistపార్టీకి జనరల్ సెక్రటరీగా ఉండేవారు.. నైజాం సంస్థానంలో ప్రవేశించాలంటే మునగాల పరగణా నుండి నేలకొండపల్లి గ్రామం ప్రవేశద్వారంగా వుండేది. ఆకారణం వల్లనే ఆంధ్రానాయకులంతా నేలకొండపల్లి వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళకు  విరాట్రాయాంధ్ర గ్రంధాలయం సమావేశ వేదికగా వుండేది.

శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ప్రేరణతో శ్రీ పెరవెల్లి వెంకటరమణయ్య తాను మధిర పట్టణం లో చేస్తున్న S.I of Police ఉద్యోగానికి రాజీనామా చేసి కమ్యునిస్ట్  ఉద్యమంలో చేరాడు.

శ్రీ పెరవెల్లి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో నైజాం రీజియన్ కమ్మ్యునిస్టుపార్టీ ఆవిర్భవించింది. స్టేట్ కమిటీలో కుడా ఖమ్మం నాయకులే ఎక్కువగా ఉండే వారు. ఒక క్రమంలో తరువాత పార్టీ విస్తరించింది. పార్టీ ఆవిర్భవించగానే మొట్టమొదటగా నేలకొండపల్లి, గోకినపల్లి, తల్లంపాడు, తిరుమలాయపాలెం, సిరిపురం, అల్లినగరం గ్రామాలలో పార్టీశాఖలు ఏర్పడ్డాయి.  చాలా కాలం వరకు కమ్యూనిస్ట్ పార్టీ నైజాంలో ఆవిర్భావం  జరిగినట్లు ప్రభుత్వవర్గాలు పసిగట్ట లేకపోయాయి. చాప క్రింద నీరులా పార్టీ నిర్మాణం జరిగింది. నైజాంలో ఫస్ట్ అండర్ గ్రౌండ్ పార్టీ కమ్యునిస్ట్ పార్టీనే.

ఇక జిల్లాకమిటీల  విషయానికి వస్తే మొట్టమొదటి కమిటీ వరంగల్లు జిల్లాలోనే ఏర్పాటు అయినది. జిల్లా జనరల్ సెక్రటరీగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు వుండేవారు. ఆ తరువాత నల్లగొండ జిల్లా కమిటి ఏర్పాటు అయినది. ఆ జిల్లాకు శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావు పార్టీ జనరల్ సెక్రటరీ గా ఉండేవారు. జిల్లా సెక్రటరీలంతా కుడా స్టేట్ సెక్రెటరియేటులో  వుండేవారు. పార్టీ ప్రణాళికలో భాగ స్వాములుగా వుండేవారు.

వరంగల్ జిల్లా పోరాటాలకు ఖమ్మం తాలుకా కేంద్ర బిందువుగా వుండేది. ఖమ్మం తాలూకా కమ్మ్యునిస్ట్ పార్టీ రాజకీయ కేంద్రస్థానం నేలకొండపల్లిలోనే వుండేది. ఖమ్మం తాలూకా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ K.L.నరసింహారావు  నేలకొండపల్లిలోనే వుండి పార్టీ కార్యకలాపాలు నిర్వహించే వారు.

బ్రిటిష్ ఇండియాకు చెందిన మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఆంధ్రాలో కమ్యునిస్టుపార్టీ కార్యక్రమాలు ఎక్కడ పెట్టుకున్నాఅక్కడి కాంగ్రెసుపార్టీ కార్యకర్తలతో  ఘర్షణలు జరుగుతుండేవి. కమ్యూనిస్టు  పార్టీ  స్వాతంత్రసమరంలో వాళ్ళతో పాటు భాగస్వాములు కావటంలేదని కాంగ్రెసుపార్టీ అభియోగం. నైజాం సంస్థానంలో పరిస్థితులు వేరు. నైజాంలో మాత్రం ఆంద్రమహాసభ వేదికగా కాంగ్రెస్, కమ్మ్యునిస్టులు కలిసే పనిచేసేవాళ్ళు. సిద్ధాంతాలు వేరైనా 12 వ ఆంద్ర మహాసభ వరకు కలిసే పనిచేశారు. వరంగల్లుజిల్లా ఆంద్రమహాసభకు ప్రెసిడెంటుగా శ్రీ జమలాపురం కేశవరావు, జనరల్ సెక్రటరీగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు వుండేవారు.

నైజాంలో కాంగ్రెసువారు మరియు కమ్యూనిస్టులు 12 వ ఆంద్రమహాసభతో విడిపోయారు. మొట్టమొదటి పూర్తి కమ్యూనిస్టు ల వేదిక 12 వ ఆంద్ర మహాసభ 1945 సంవత్సరంలో మార్చ్ 26-28 తేదీ వరకు ఖమ్మం ప్రక్కనున్న ఖానాపురం హవేలీ గ్రామంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఆధ్వర్యంలో జరిగింది. ఆరోజుల్లో ఆసమావేశానికి 40 వేలమంది ప్రజలు వచ్చారు. ఆ సమావేశంలో 13 వ ఆంద్రమహాసభకు ప్రెసిడెంటుగా శ్రీ బద్దం ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఎన్నికఅయ్యారు. ఈ సమావేశానికి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య అతిధిగా వచ్చారు. కమ్యూనిస్టుపార్టీపై నిషేధం వుండటంవల్ల సమావేశంలో శ్రీ సుందరయ్యగారు మాట్లాడలేదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పారు. 12 వ ఆంద్ర మహా సభ జరిగిన వెంటనే 1946 సంవత్సరంలో నైజాంలో ఆంద్రమహాసభను  కూడా నిషేధించటంతో అదే చివరి సమావేశం అయినది.

1946లో న్యూడిల్లీలో జరిగిన అఖిల భారతీయ సంస్థాన సంఘటన్ సమావేశం తరువాత ఉద్యమం నైజాం వ్యతిరేక సాయుధ పోరాటం పంధాన వెళ్ళుటకు కమ్యునిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది. న్యూ ఢిల్లీలో జరిగిన సమావేశానికి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ AD HOC కమిటీ మెంబరుగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు హాజరు అయినారు.

పోరాటం ఆరంభం అయినది. 1946 సంవత్సరంలో కమ్యూనిస్ట్, మరియు ఆంద్రమహాసభలపై  నిషేధం వున్నకారణంగా బోర్డరు క్యాంపులు  ఏర్పాటు చేయబడ్డాయి. పార్టీఆఫీసులు విజయవాడకు మళ్ళించబడినవి.

అంతకు ముందు 1946 సంవత్సరంలో ఇండియాకు స్వాతంత్రం రాకముందే శ్రీ జవహర్లాల్ నెహ్రు ప్రధానమంత్రిగా కేంద్రంలో ప్రభుత్వంను బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వంతో ఒక సంవత్సర కాలానికి నైజాంప్రభుత్వం Standstill Agreement ను కుదుర్చుకుంది. అప్పుడే నైజాం సంస్థానంలో కాంగ్రెసుపార్టీ మీద వున్న నిషేధాన్ని ఎత్తివేశారు. నిషేధం ఎత్తివేసిన  సమయంలోనే మహాత్మాగాంధి మద్రాస్ నుండి రైలులో వెళుతూ మార్గమధ్యంలో  ఖమ్మంలో  ఉపన్యసించారు. కాంగ్రెసుపార్టీపై నిషేధం ఉన్న సమయంలో కార్యకలాపాలు విజయవాడ నుండి జరిగేవి. శ్రీ V.B. రాజు ఆఫీస్ ఇంచార్జీగా వుండేవారు. నిషేధం తొలగిన తరువాత కాంగ్రెసుపార్టీకి నైజాంరాష్ట్రపార్టీ ప్రెసిడెంటు గా శ్రీ నానాల్, ప్రధాన కార్యదర్శిగా శ్రీ మాడపాటి రామచంద్రరావు వుండేవారు.

బ్రిటిష్ ఇండియా కమ్యునిస్టుఉద్యమం గురించి చెప్పేటప్పుడు శ్రీ P.C.JOSHIని మరువలేరు. ఆయన ద్రుఢమైన మాస్ లీడర్. బ్రిటిష్ ఇండియా కమ్యూనిస్టుపార్టీకి  జనరలుసెక్రటరీ. ఎంతోమంది యువకులకు దిశానిర్దేశం చేసినవారు. ఒకసారి 36 గంటల పాటు ఏకబిగిన ఉపన్యసించారు. శ్రీ పుచ్చల పల్లి సుందరయ్య వివాహంకూడా ఆయన సమక్షంలోనే బొంబాయలో నిరాడంబరంగా జరిగింది.  నైజాంలో వున్న యువకమ్యునిస్ట్ నాయకులందరికీ ఆయన గురుతుల్యుడు.

ఇండియన్ యూనియన్ సైన్యాలు నైజాంను లొంగదీసుకోవటానికి హైదరాబాదును నలువైపులా చుట్టుముట్టినవి. అతను అంతకు ముందర ఇండియన్ యూనియనుతో చేసుకున్న "STANDSTILL AGREEMENT ను కూడా విస్మరించి స్వాతంత్రాన్ని ప్రకటించు కోవటానికి చేస్తున్న ప్రయత్నాలు ఇండియాకు తెలుసు.

సెప్టెంబర్, 13, 1948 తేదిన నైజాంలో ఇండియన్ ఆర్మీ ప్రవేశించినది. నాలుగు రోజులలోనే 1947, SEPTEMBER, 17 న నైజాం, అతని సైన్యం లొంగిపొయింది. రజాకార్లు ఆయుధాలు వదలి తోక ముడిచారు. ఖాశిం రజ్విని అరెస్ట్ చేశారు. నైజాం ప్రభుత్వాన్నిరద్దు  చేశారు. దీనినే "ARMY & POLICE ACTION " అని పిలిచారు.

శ్రీ P. C. JOSHI నాయకత్వంలోని బ్రిటిష్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ ఆగష్టు, 15, 1947 న ఇండియా స్వాతంత్రం పొందినట్లు బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రకటనను స్వాగతించింది.

కానీ కొరియా యుద్ధం ప్రభావం కారణంగా స్టాలిన్ ప్రమేయంతో CPI అప్పటి  వరకు అనుసరించిన రాజకీయ  పంధాను (నైజాం సంస్థానం ఇండియాలో విలీనం కావటం, ఇండియా స్వాతంత్రాన్ని గుర్తించటం ఇతరాలు)  వెంటనే మార్చుకొంది.  పార్టీలో విభిన్నవాదాలు ప్రారంభము అయినవి. శ్రీ జోషి వంటరి అయినారు . ఫలితంగా శ్రీ P.C. జోషిని ఆల్ ఇండియా కమ్యూనిస్టుపార్టీ జనరల్ సెక్రటరీ  పదవిలో నుండి డిసెంబర్ 1947 తేదీన REMOVE చేశారు. కలకత్తాలో 1948, ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 6 వ తేదీ వరకు జరిగిన రెండవ కాంగ్రెసులో శ్రీ B.T. RANADIVE ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఆయన నేతృత్వంలోని CPI పోరాటాన్ని కొనసాగించే నిర్ణయం చేసింది. ఇండియన్ యూనియన్ సైన్యాలు నైజాంకు రావటాన్ని తప్పుపట్టింది.

నైజాం కమ్యూనిస్టుపార్టీ కూడా ఇండియన్ యూనియన్లో విలీనం కాకుండా పోరాటం కంటిన్యూ చేయటం సమంజసం కాదని అభిప్రాయ పడినది. కానీ వారి అభిప్రాయానికి మద్దతు లభించలేదు. శ్రీ రావి నారాయణరెడ్డి  లాంటివారు కేంద్రపార్టీ ఆదేశాలను జీర్ణించుకోలేకపోయారు. ఆయన నైజాంనుండి వెళ్ళిపోయి బాంబే వెళ్లిపోయారు. నిజాంవిమోచనం తరువాత ఇండియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కంటిన్యూ చేయటాన్ని వ్యతిరేకించిన శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు లాంటివాళ్ళు పార్టీనుండి బయటకు వచ్చారు. ఆసమయంలోనే మలేసియాలో జరిగిన "Congress of Communist International లో కూడా శ్రీ సత్యనారాయణ రావు రాజీనామా ప్రస్తావనకు వచ్చింది.

ఆ సమయంలోనే  ఖమ్మం వచ్చిన నైజాంరాష్ట్ర కమ్యునిస్టుపార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ పెరవెల్లి వెంకటరమణయ్యని నైజాం పోలీసులు అరెస్ట్ చేసి కారాగారానికి  పంపారు. తనను పెంచి విద్యాబుద్ధులు నేర్పించిన తననాయనమ్మ అంతిమసంస్కారాలకు ఆయన ఖమ్మం వచ్చారు. చిన్నతనంలోనే రమణయ్యగారి తల్లితండ్రులు చనిపోవటంతో వాళ్ళనాయనమ్మే ఆయనను పెంచింది. ఆయన అరెస్ట్ ఆరోజుల్లో పెద్ద సంచలనం. రైల్వే Station లోనే రమణయ్య గారిని చూసిన పోలీస్ సిబ్బందికి ఆయనను అరెస్ట్ చేసే ధైర్యంసరిపోలేదు.పైఅధికారులతో సంప్రదిపుల తరువాత అంత్యక్రియల స్థలంలో ఆయనను అరెస్ట్ చేశారు.

తప్పనిసరి పరిస్థుతులలో శ్రీ P.V.రమణయ్య స్థానంలో 1951 ఆఖరు వరకు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య రాష్ట్ర బాధ్యతల స్వీకరించారు. 1948-1951 వరకు ఆయన నైజాంలో అండర్ గ్రౌండ్ లో వున్నారు.

చివరగా శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావులు  అండర్ గ్రౌండుగా పోరాటం నడిపించారు.

ఈ పోరాటం నుండి కమ్యూనిస్ట్ సానుభూతి పరులు మినహా అన్ని రాజకీయ, రాజకీయేతర సంస్థలు వెళ్లిపోయాయి. నైజాంవిమోచనం కలుగటంతో తాము అనుకున్న పోరాటం ముగిసిందని తలచారు. కమ్మ్యునిస్టులు ఒక్కరే ఒంటరిగా గ్రామాలనుండి అడవులకెళ్ళారు. క్రమంగా ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఒంటరిపోరాటం కావటంతో, సైన్యాలు నలుదిశలా మొహరించటంతో ఉద్యమకారులు ఇబ్బంది పడ్డారు. పార్టీ సానుభూతిపరులు కూడా వారికి ఏమి సాయం చేయలేని స్థితి.

ఈ సమయంలో పోరాటప్రారంభంలో తెలంగాణా కామ్రేడ్స్ అభీష్టాన్ని రష్యా పాలకులకు చెప్పి పోరాట విరమణకు అనుమతికై బ్రిటిష్ ఇండియా తరఫున నలుగుబృందము రష్యాకు వెళ్ళింది. అందులో సర్వశ్రీ  P.C.JOSHI,  S.K.DANGE, CHANDRA RAJESWARA RAO, MAKINENI BASAVAPUNNAIAH వున్నారు. ఎందుకనో నైజాం నాయకుల ప్రాతినిధ్యం రష్యా వెళ్ళిన బృందంలో లేదు. రష్యా అధినేత శ్రీ JOSEPH STALIN ఎనిమిదినెలల దాకా వాళ్లకు INTERVIEW ఇవ్వలేదు. ఈలోపు కొన్ని వందలమంది నాయకులు కార్యకర్తలు మరణించారు. ఎంతమంది, ఎక్కడెక్కడ మరణించారో కుడా గణాంకాలు సేకరించలేని స్థితి.

చివరగా 1951 SEPTEMBERలో CPI కేంద్ర నాయకత్వం వాస్తవపరిస్థితిని గమనించి, అర్ధం చేసుకుని సాయుధ పోరాట విరమణకు అంగీకరించింది.

సెప్టెంబర్, 1948 తేదీననే ఇండియన్ యూనియనులో కలువటానికి ఒప్పుకుని, అప్పటివరకు ప్రశాంతంగా సాగిన పోరాటాన్ని విరమించి తమ డిమాండ్లను ఇండియా కాంగ్రెసు గవర్నమెంటు  పై వత్తిడి తెచ్చి సంస్కరణలు తీసుకొచ్చే మార్గం వేస్తె బాగుండేదని చరిత్ర పరిశీలకుల భావన.  అలా జరగనందున భూపంపిణీకి ఎవ్వరిమీద వాళ్ళు పోరాటంచేశారో వాళ్ళే రాజ్యాధికారంలో కాంగ్రెసుపార్టీ నీడన భాగస్వాములైనారని, బలహీనవర్గాలు నష్టపోయారని (భూ పంపిణీ వగైరా..)  విశ్లేషణ.

నైజాం ప్రభుత్వం విమోచనం/ స్వతంత్ర భారతావనిలో విలీనం అయిన తరువాత  తెలంగాణాలో రాజకీయ, సామాజిక మార్పులు వచ్చినవి. 1951 సెప్టెంబరులో కమ్యునిస్టులు  సాయుధపోరాట విరమణ చేశారు. తరువాత 1972 సంవత్సరంలో  శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు కూడా తెలంగాణా సాయుధ పోరాటం నేర్పిన LESSONS ను  గ్రంధపరంగా  వెలువరించారు.

క్రింది చిత్రం కమ్యూనిస్టుపార్టీ వ్యవస్థాపకసభ్యులు మరియు వరంగల్లుజిల్లా ఆంద్రమహాసభ నాయకులు.


(1).క్రింద కూర్చున్న వారు: కుడి నుండి ఎడమ వైపుకు. సర్వశ్రీ 1. గుండపనేని హనుమంతరావు ,2. K. L. నరసింహారావు, 3. కందిమళ్ళ శేషగిరిరావు, 4. కొండపల్లి గోపాలరావు.

(2).కుర్చీలలో కూర్చున్నవారు: కుడి నుండి ఎడమ వైపుకు : సర్వశ్రీ 1. పారుపల్లి రామయ్య, 2. చిర్రావూరి లక్ష్మినరసయ్య, 3. పెరవెల్లి వెంకటరమణయ్య, 4. పెండ్యాల సత్యనారాయణరావు, 5. వట్టికొండ నాగేశ్వర రావు, 6. సర్వదేవభట్ల రామనాధం.

(3).వెనుక నిలుచున్నా వారు: కుడి నుండి ఎడమ వైపుకు :సర్వశ్రీ 1. రావెల్ల జానకిరామయ్య, 2. పబ్బరాజు రంగారావు, 3. మచ్చా వీరయ్య, 4. సామినేని అచ్యుతయ్య, 5. దశరధ రామయ్య, 6. పర్చా దుర్గా ప్రసాదరావు, 7. వాసిరెడ్డి వెంకటపతి, 7.నేదునూరి జగన్నాధరావు.
    
                                                           -----పెండ్యాల వాసుదేవరావు.


<!-- Google tag (gtag.js) -->
<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Sunday, July 1, 2018

నా జీవన పోరాటం --రాజకీయ పరిణామాలు.1991-94 మధ్యన


56. (NKP-9). 

నా జీవన  పోరాటం --రాజకీయపరిణామాలు.1991-94 మధ్యన  


నా మూడవ టర్మ్ నేలకొండపల్లి సహకార గ్రామీణ బ్యాంకు ఎన్నికలు......అనంతర రాజకీయ పరిణామాలు.

1992 జనవరి నెలలో సహకార గ్రామీణ బ్యాంకు  ఎన్నికలోచ్చాయి. 1991 సంవత్సరం డిసెంబర్ నెల 25 వ తేదిన మా తండ్రి గారు మరణించారు. ఆయన మరణించిన నెలరోజులకు మొదటి మాసికం 23rd January నాడే నేలకొండపల్లి గ్రామీణ బ్యాంకు ఎన్నికలు జరిగాయి. మా తండ్రిగారి మరణంతో జరిపించవలసిన సాంప్రదాయ కార్యక్రమాలతోనే, పలుకరించ వచ్చినవారితో మాట్లాడటంతోనే నాకు సమయం సరిపోవటంతో ఎన్నికల నిర్వహణపై ఎక్కువ శ్రద్ధ చూపలేకపోయాను.

ఆయన మరణించటంతోనే నా రాజకీయ జీవితం అంతమొంధించటానికి మా వ్యతిరేకులంతా సమావేశమై వ్యూహం రచించారు.ఈ సమయం దాటితే మళ్ళీ నన్ను ఎదుర్కోవటం సాధ్యం కాదని వారి భావన. నాకు అత్యంత దగ్గరగావున్న వ్యక్తులు శ్రీ వాక కృష్ణ లాంటి వాళ్ళు నన్ను వదలి వెళ్లి పోయారు. వ్యతిరేక పానెల్ లో పోటిచేశారు. మాకులం వాడైన శ్రీ భగవాన్లు లాంటి వాళ్ళు వ్యతిరేకం చేశారు.

అయినా ఎన్నికలలో పోటీచేయటానికి వార్డ్ ల వారీగా పానెల్ తయ్యారు చేసి కదన రంగంలోకి దిగాము. ఎన్నికల రోజు రానే వచ్చింది. ఆ రోజు మా తండ్రి గారి మొదటి మాసికం కావటంతో సాయంకాలం దాకా నాకు ఆ కార్యక్రమమే సరిపోయింది. ఆ రోజు ఎన్నికల పోలింగ్ నిర్వహణను Poling Agents మరియు Contesting Candidates కే అప్పగించి  సాయంకాలం నేను కౌంటింగ్ ప్రదేశానికి వెళ్ళే సమయానికి అక్కడ పోలీస్ మోహరింపు అధికంగా కనిపించింది. ఫలితాలు ప్రకటించే సమయం ఆసన్నం అయింది.

ప్రశాంతంగా వున్న ఆ వాతావరణంలో పోలీసుల హడావిడి అధికంగా కనిపించింది. ఎన్నికల ఫలితాలు బహిర్గతం అయ్యే సమయంలో కనిపించిన జనాన్ని కనిపించినట్లు లాటీ ఛార్జ్ చేయటం మొదలెట్టారు. అలా పది మంది జనాలకు కాళ్ళు, చేతులు విరిగాయి. రక్తం వరదలై పారింది. దాన్ని చుసిన నేను సమీపంలో వున్న కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రభాకర్ ను ఇదేమిటని ప్రశ్నించాను. వాళ్ళు మా మీధ రాళ్ళు వేశారని చెప్పారు. అది అవాస్తవం.

ఆ ఎన్నికలు అంతకు ముందు జరిగిన విధానంలా ప్రెసిడెంట్ ఎన్నిక ప్రత్యక్ష పద్హతిలో జరుగక పరోక్ష పద్దతిలో  జరుపుతున్నారు.  మా పానెల్ నుండి 5 గురు డైరెక్టర్స్ గెలిచారు. తెలుగు దేశానికి రెండు, CPM కు రెండు.  CPI కు రెండు డైరెక్టర్స్ వచ్చాయి. నేను ఎన్నికల అధికారి దగ్గరకు వెళ్లి వార్డ్ కు గెలిచినట్లు ధ్రువ పత్రాన్ని తీసుకుని బయటకు వచ్చాను. అంతే. పోలీసులు నన్ను చుట్టు ముట్టి లాటీ ఛార్జ్ చేశారు. అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారు. కారణం అడిగితే చెప్పలేదు.

అక్కడున్న పోలీస్ వాళ్ళు, మరియు జనాలు వందల్లో వెంటరాగా స్టేషన్ కెళ్ళాను. నావెంట వస్తున్న పేరాల గాంధి లాంటి యువకులను వద్దని వారించినా వినలేదు. నా వెన్నంటే స్టేషన్ కు  వచ్చారు.

అప్పటికే ఊరంతా ఈవార్త దావానలంలా వ్యాపించింది. ఆసమయంలో జనాన్ని రెండు కిలోమీటర్స్ దాకా తరిమి కొట్టారు. అందులో పోలీసుల చేతులలో దెబ్బలు తిన్న జనాలందరూ  నేలకొండపల్లిలోని, అనాసాగరం గ్రామము లోని  B.C లు మరియు  S.C లే ఎక్కువగా వున్నారు. శ్రీ దెశబొయిన గడ్డయ్య లాంటి వయసు మళ్ళిన పెద్దలు వున్నారు.

విషయం తెలిసిన పత్రికా విలేఖరులు స్టేషన్ కు వచ్చి నన్ను కలిశారు. పోలీస్ స్టేషన్ లోనే విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పోలీస్ వాళ్ళ అరాచకాన్ని వివరించాను. మరుసటి రోజు ఉదయం అన్ని దిన పత్రికలలో ఈ వార్త ప్రముఖంగా ప్రచురితము అయినది. ఏమనుకున్నారో ఏమో పోలీస్ అధికారులు  నన్ను, నా సమావేశాన్ని అడ్డగించలేదు. ఆ సమయంలో విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన స్థానిక మండల రెవిన్యూ అధికారి శ్రీ రాములు అక్కడనే వున్న కూసుమంచి C.I. of Police తో చర్చించటం జరిగింది. "ఒక వ్యక్తి కొసము ఇంత హంగామా జరుగుతుందా? ఇంత మంది జనాలు వస్తారా?" అనే C.I ప్రశ్నకు "అవును. వాళ్ళ కుటుంబ చరిత్ర అలాంటిదని"  MRO సమాధానం చెప్పటం జరిగింది. ఆ సమయంలో అక్కడనే వుండి సంఘటనను చూసిన శ్రీ వంగవీటి వెంకట సుబ్బయ్య "వాసుదేవరావు కు రాజకీయం గా మళ్ళీ ప్రాణం పోశారని" వ్యాఖ్యానించాడు.

విషయం తెలుసుకున్న ఖమ్మం పట్టణ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ కౌటూరు దుర్గాప్రసాద్ జోక్యంతో ఆ రోజు నేను స్టేషన్ నుండి బయటకు వచ్చాను. "రేపు ఉదయం ఒకసారి రమ్మని, ఇప్పుడు వెళ్ళండని" పోలీస్న స్టేషన్ హౌస్ ఆఫీసర్  పంపించారు. శ్రీ కౌటూరు దుర్గాప్రసాద్ శ్రీ జలగం ప్రసాదరావు కు కుడి భుజంగా ఉండేవాడు. జిల్లా కేంద్రంలో ఆయన తరఫున కార్యక్రమాలన్నీ ఈయనే చూసేవాడు.

మర్నాడు ఉదయం పోలీస్ అధికారులు చెప్పిన ప్రకారం పోలీస్ స్టేషన్ కు బయలు దేరాను. ఇంట్లోనుండి ఒక్కడినే బయలుదేరాను. నేను పోవటం చూసి బజారులో అరుగుల మీద, షాప్స్ ముందర, షాపు లలో వున్న మరియు ఇంటి ముందర వున్న జనాలందరు నన్నేమి ప్రశ్నించ కిండానే మౌనంగానే నన్ననుసరించారు. పోలీస్ స్టేషన్ entrance ముందర వెనక్కి తిరిగి చూసే సరికి సుమారుగా ఒక వెయ్యి మంది జనాలు నిలబడి వున్నారు. వారంతా క్రమశిక్షణగా ఒకే వరుసలో TRAFFIC కు ఇబ్బంది లేకుండా రోడ్ కు ఆవలి ప్రక్కన నిలబడ్డారు. అందులో అన్ని పార్టీల వారున్నారు. అన్ని కులాల వారున్నారు.

అప్పుడు నేలకొండపల్లి  స్టేషన్ లోనే వున్న ఖమ్మం DSP ఒక పది నిమిషాలలోనే "మిమ్ముల తరువాత పిలుస్తాం వెళ్ల"మని పంపించేశారు.

ఆ తరువాత 30 మంది మీద FIR ISSUE చేశారు, నేను ప్రధమ ముద్దాయిని.  సహకార ఎన్నికల సమయంలో విధులను నిర్వర్తిస్తున్న  KUSUMANCHI C.I OF POLICE ను కొట్టానని, విధులకు ఆటంక పరిచానని నా మీద అభియోగం. క్రింద మున్సిఫ్ కోర్ట్ లో నేను మినహా అందరి మీదా అభియోగాలు రుజువు కాలేదని కేసు ను కొట్టి వేశారు. అప్పీల్ లో అడిషనల్  జిల్లా కోర్ట్ లో నా మీద కేసు ను కొట్టి వేశారు.



ఇగ సహకార గ్రామీణ బ్యాంకు ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే ....
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన సంస్కరణల ఫలితంగా అధ్యక్ష ఎన్నిక INDIRECT పద్ధతి కి మారటమే కాకుండా ప్రభుత్వం ఇద్దరు స్త్రీలను నామినేట్ చేయటం ప్రవేశ పెట్టింది. దొడ్డిదోవలో అధికారాన్ని హస్తగతం చేసుకోవటం దాని లక్ష్యం.

కాంగ్రెస్ ప్రభుత్వం NOMINATE  చేసిన యిద్దరు లేడీ డైరెక్టర్స్ ను పాలేరు MLA శ్రీ సంభాని చంద్రశేకర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మొహరించిన విపక్షానికి సపోర్ట్ గా యివ్వటం వలన ఆరెగూడెం గ్రామానికి చెందిన శ్రీ గుత్తా వెంకటేశ్వరరావు(TDP) PRESIDENT గా ఎన్నికయ్యాడు. నేను డైరెక్టర్ గా వున్నా ప్రెసిడెంట్ గా ఎన్నిక కాలేక పొయ్యాను. తనను MLA గా గెలిపించిన లోకల్ కాంగ్రెస్ కు శ్రీ సంభాని చంద్రశేఖర్  అలా వెన్ను పోటు పొడిచాడు.

కాల చక్రం గిర్రున మూడు సంవత్సరాలు తిరిగింది. రాజకీయంగా పెను మార్పులు కూడా చాలా జరిగినవి.

శ్రీ జలగం ప్రసాదరావుకు ఎవ్వరిని నమ్మేతత్వం లేనట్లు అనిపించింది. ఆయన వెంటనేవుండి రాజకీయంగా ఆయనకే పనిచేసినా నావ్యతిరేకులకే అధిక ప్రాధాన్యత నిచ్చాడు. సహకార ఎన్నికలలో నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళనే దగ్గరకు తీసి నన్ను రాజకీయంగా మైనస్ చేయటానికి ప్రయత్నించాడు. శ్రీ సంభానికి వ్యతిరేకంగా వాడుకోవటానికి మాత్రమే నన్ను ఉపయోగించుకున్నాడు.

ఆ సమయంలోనే ఒకసారి MLA సంభాని చంద్రశేకర్ కు వ్యతిరేకంగా AP CM శ్రీ నేదురుమల్లి జనార్ధనరెడ్డి వద్దకు ప్రజాభిప్రాయాన్ని వినిపించటానికి  శ్రీ జలగం ప్రసాదరావు సలహాతో హైదరాబాద్ వెళ్ళాము. ఖర్చు అంతా శ్రీ కూసుమంచి రంగారావు పెట్టుకున్నట్లుంది. హైదరాబాద్ చేరుకోగానే ప్రసాదరావు గారితో ఆయన వెంట శ్రీ జలగం వెంగళ రావు గారింటికి వెళ్ళాము   అక్కడి నుండి CM Camp office కు వెళ్లాలని ఆలోచన.

జలగం వెంగళ రావు గారు ఎవ్వరిని వ్యక్తిగతంగా కలువటానికి అవకాశము ఇవ్వలేదు. నాపేరు వ్రాసి ప్రత్య్హేకంగా నేను స్లిప్ పంపాను. వెంటనే నాకు  పిలుపు వచ్చింది. ఒక్కడినే వెళ్లాను. హాల్ లో వున్న థ్రెడ్ మిల్ ప్రక్కనే చైర్ లో కుర్చుని వున్నారు. నన్ను చూడగానే సాదరంగా ఆహ్వానించారు. మా తండ్రిగారు చనిపోయిన తరువాత నన్నదే చూడటం కాబట్టి కుటుంబ స్థితి గతుల విచారించారు. "సహకార ఎన్నికలలో చంద్రశేఖర్ కాంగ్రెస్ నామినేటెడ్ సభ్యులను మీకివ్వలేధట కదా?" అని అడిగారు. అవునని చెప్పాను. "అన్ని విపులంగా CM గారికి చెప్పండని నాతో అన్నారు. మీరే నాయకత్వం వహించాలి Representation కు అన్నారు. ఫలానా వారు చెబుతారని నేనంటే "లేదు, లేదు--మీరే నాయకత్వం వహించాలన్నారు. మా కుటుంబం పట్ల ఆయన కున్న అభిమానం అలాంటిది. 1975 సంవత్సరంలో కుడా మా తండ్రి గారితో కలిసి వెంగళరావు గారు AP CM గా వుండగా ఆయనను కలవటానికి వెళ్తే మానాయన గారు స్లిప్ పంపిన 5 నిమిషాలలోనే లోపలకు పిలిచారు. అక్కడ అప్పుడు ఆయన కోసం MINISTERS, MLAS, MPS మరియు స్టేట్ TOP OFFICIALS వేచియున్నారు.

జలగం ప్రసాద రావు గారికి ఆయన తండ్రి వెంగళరావు గారికి మా కుటుంబం పట్ల వున్నవైఖరిలో, గౌరవించడంలో  తేడాకు  నిదర్శనం ఆ సంఘటన.

శ్రీ జలగం ప్రసాదరావు వర్గం నుండి బయటకు వచ్చిన తరువాత గవర్నమెంట్ కాంగ్రెస్ అయి వున్నారాజకీయం గా నాది వంటరి పోరాటమే అయినది. నా వెంట వున్నది అంతా బలహీన వర్గాల వాళ్ళే. రాజకీయ పోరాటం చేయాలంటే జనబలం వుంది కాని,ఆర్ధిక బలం లేదు. ఆర్ధిక బలం లేక, సొంత పార్టీ అధికారంలో వున్నా ప్రభుత్వం అండ కూడాలేక వున్న జనాన్ని రక్షించుకో వటం ఎలానో తెలీక సతమతమై పోయాను.

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించవలసి వుంది. నేలకొండపల్లి నూతన బస్ స్టాండ్  ప్రారంభోత్సవానికి స్థానిక MLA శ్రీ సంభాని చంద్రశేఖర్ ముహూర్తం నిర్ణయం చేశాడు. ప్రారంభ ఆహ్వాన పత్రికలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి పేరు లేదు. మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు వ్రాసివుంది. తనకు రాజకీయ భిక్షను ప్రసాదించిన సత్యనారాయణ రావు గారిని అవమానించటం గానే దాన్ని భావించాము. శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు అప్పుడు గ్రామ సర్పంచ్ గానే వున్నారు. దాంతో నేను సహకార ఎన్నికలకు ముందరే నేను లోకల్ పాలేరు MLA శ్రీ సంభాని చంద్ర శేఖర్ ఏకపక్ష నిర్ణయాలను విభేదించి ఆయనకు వ్యతిరేకంగా శ్రీ జలగం ప్రసాదరావు దగ్గరకు వెళ్ళటం జరిగింది. దానితో అసంతృప్తి గా వున్న శ్రీ చంద్రశేఖర్ దగ్గరకు అంతకు ముందే అప్పుడే తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన కొందరు పొరుగు గ్రామాల నాయకులు, వచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనుటకు పాచికలు విసిరారు. ఫలితమే నేలకొండపల్లి గ్రామంలో ఎన్నడు జరుగని ఈ సంఘటన కు  ఆస్కారం లభించింది.

నాకు వ్యతిరేకంగా చంద్రశేకర్ దగ్గర పాచికలు విసిరిన నాయకులకు నాకు మధ్యన కొంత కాలం క్రితం ఒక సంఘటన జరిగింది.

1984 సంవత్సరంలో నేలకొండపల్లి గ్రామంలోని మెజారిటీ జనాల దగ్గరనుండి అందరము శ్రీ నందమూరి తారక రామారావు నాయకత్వంలోని TDP పార్టీ లోకి వెళ్లాలని వత్తిడి వచ్చింది. దానికి మా తండ్రి గారినుండి వ్యతిరేకత రానందున ఆ ఆలోచన చేశాము. అప్పుడే పైనంపల్లి గ్రామానికి కి చెందిన శ్రీ నాగుబండి లక్ష్మి నారాయణ, ముజ్జిగూడెం గ్రామం నుండి శ్రీ వున్నం వెంకయ్య, అనాసాగారం గ్రామం నుండి శ్రీ జోగుపర్తి వీరభద్రయ్య, పాత కొత్తూరు నుండి శ్రీ రావెల్ల అచ్యుతరావు తదితరులు కుడా నాదగ్గరకు వచ్చి "తాము కుడా మీతో పాటు TDP లో చేరుతామని" నాతో చెప్పారు. శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి ఆసీస్సులతోనే తాము TDP లోకి వెళుతున్నామని చెభితే తమ పెద్ద వాళ్ళు తమని తప్పు పట్టరని, కోపగించరని వారి ఉద్దేశ్యం. శ్రీ కరణం రామచంద్రరావు రాష్ట్రమంత్రి మరియు జిల్లా INCHARGE MINISTER  ప్రోగ్రాం నేలకొండపల్లిలో తాము ఏర్పాటు చేయాలని అన్ని సవ్యంగా జరుగుతే తామంధరము TDP లో చేరాలని నిర్ణఇంచుకోన్నాము. మంత్రిగారి సమావేశాన్ని జయప్రదం చేయమని  కరపత్రాన్ని CO-OPERATIVE రూరల్ బ్యాంకు ప్రెసిడెంట్ హోదాలో పంచిపెట్టాను.

అప్పటికి ఇంకా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు జిల్లా నాయకత్వ హోదాలోకి రాలేదు. శ్రీ కోనేరు నాగేశ్వరరావు (కోత్తగూడెం MLA) జిల్లా నుండి రాష్ట్రమంత్రిగా వున్నారు. శ్రీ పెందుర్తి మధుసూదనరావు మరియు ఖమ్మంకు చెందిన జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ రామమోహనరావు ద్వారా శ్రీ కరణం రామచంద్రరావు, రాష్ట్ర మంత్రి గారి ప్రోగ్రాం శ్రీ భక్త రామదాసు మందిరంలో ఏర్పాటు చేశాము. ఆరోజు రానే వచ్చింది. అనాసాగారం నుండి జనం మేళ తాళాలతో వచ్చారు. మిగతా గ్రామాల జనాలు కూడా బాగానే హాజరు అయ్యారు.

నేను TDP అధికార పార్టీ లోకి వస్తే తమ రాజకీయ మనుగడకు ప్రమాదమని భావించిన మా వ్యతిరేకులంతా ఏకమయ్యారు. మంత్రిగారిని మా ప్రోగ్రాముకు  రాకుండా ఉండటానికి పావులు కదిపారు. సమావేశం ఫెయిల్ అవుతే మేం Defame కావాలని, అధికార పార్టీ ప్రవేశాన్ని అడ్డుకోవచ్చని వారి ప్రణాళిక. పోటి సమావేశాన్ని శ్రీ యీగా వెంకటేశ్వరరావు రైస్ మిల్ లో ఏర్పాటు చేసి కోధాడ వైపు నుంచి వస్తున్న మంత్రిగారిని ఆపి వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశానికి తీసుకెళ్ళి మా సమావేశాన్ని కాన్సిల్ చేయటానికి TDP జిల్లా పార్టీ పెద్దలపై వత్తిడి చేశారని తెలిసింది.

ఆసమావేశాన్ని TDP పార్టీ గ్రామ సమావేశమని పేరు పెట్టినా అక్కడ హంగామా అంత CPM మరియు దాని  మిత్ర పక్షాలదే ఎక్కువ హడావిడి గా వుంది. అప్పుడు నేలకొండపల్లి గ్రామ శాఖ శ్రీ P.D.KRISHNARAO సారధ్యంలో వుండేది. CPM తరఫున శ్రీ రాజపుత్ర నవరతన్ సింగ్, శ్రీ నూతక్కి గంగాధరరావుల సారధ్యం లో వుంది.

మంత్రి కరణం రామచంద్రరావు గారి కార్యక్రమం అక్కడ అయిపోయినదని తెలిసి, మా సమావేశానికి వస్తారా లేదాని తెలుసు కోవటానికి శ్రీ నాగుబండి లక్ష్మి నారాయణ , శ్రీ ఉన్నం వెంకయ్యలతో కలసి మిల్లు (మూల్పూరి) సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళాను. మంత్రిగారి దర్శనం లభించలేదు. మంత్రి గారి కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ పెందుర్తి మధుసూదనరావు మరియు శ్రీ జ్యోతి రామమోహనరావులు నిశ్యబ్ధంగా వుండిపోయారు. ఆ సమయంలో మా ప్రక్కనే వున్న సిద్ధిపేట MLA శ్రీ కల్వకుంట్ల చంద్రశేకరరావు మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయాడు. ఆయన మంత్రి గారి కాన్వోయ్ లో వున్నాడు. అస్సలు సమావేశం సంగతి మంత్రి గారి దృష్టిలో వున్నదా, లేదా  అని అనుమానం వచ్చింది. నమ్మిన వారు వెన్నుపోటు పొడిచారని స్పష్టమైంది.

అందరం సమావేశ స్థలికి తిరిగి వచ్చాము. సమావేశం రద్దు అయినదని అనౌన్స్ చేయటమే కాకుండా TDP పార్టీ లోకి వెళ్ళే ఆలోచన కుడా విరమించామని వేదికపైననే ప్రకటించాను . ఆలోచన విరమించటం అనే మాటతో నా వెంట వున్న నాయకులు అసంతృప్తి చెందారు. తరువాత శ్రీ నాగుబండి లక్ష్మి నారాయణ నాయకత్వంలో  వాళ్ళు సొంత ప్రయత్నాలతో TDP పార్టీ లో చేరటం, ఫలితంగా వాళ్ల పెద్దలతో ఆయా గ్రామాల్లో విభేదాలు రావటం జరగటంతో నేను వారితో పాటు TDP పార్టీ లోకి  రాకపోవటం వల్లనే  అది జరిగిందని వాళ్ళు నా శత్రు వర్గంగా మారటం జరిగింది. వారే తరువాత శ్రీ సంభాని పంచన చేరి పై గంధరగోళన్ని సృష్టించినట్లు తెలిసింది. దీనితో శ్రీ జలగం ప్రసాదరావు కు విషయం అవగతమై వాళ్ళపై కన్నెర్ర చేయటం, వెంటనే వారు భయపడి జలగం వర్గంలో చేరి పోవటం జరిగాయి.

అలా నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ లో పరిణామాలు సంభవించాయి.

నేను రాజకీయాలలోకి వచ్చిన దగ్గరినుండి "నేనెంతో కాలం రాజకీయాలలో ఉండలేను, ఆర్ధిక పరిస్థితి అడ్డం వస్తుందని" నా దగ్గర వాళ్ళతో అంటుండే వాడిని. ఈమాట ప్రతి దశాబ్దం తరువాత వస్తూనే వుండేది. "నువ్వు మొదటి నుండి అదే మాట అంటున్నావు.బయటకు రావాలను కుంటున్న ప్రతీసారి ఏదో కార్యకర్తల సమస్యలతో వారిని విడిచి రాలేక ఆగిపోయ్యే వాడివి" అని ఒక మిత్రుడు T. విజయకుమార్ జ్ఞాపకం చేశాడు ఒకసారి. ఎన్నికలలో ఓట్ల కోసం  ధనం ఖర్చు పెట్టాలిసిన అవుసరం రాకపోవటం, వాళ్లకు నేను సేవ చేసే విషయంలో మా పలుకుబడి, కుటుంబ చరిత్ర ఉపయోగ పడటంతో ఆర్ధిక ఇబ్బందులు అడ్డం రాలేదు.

వాస్తవంగా మా తండ్రి గారు మరణించటానికి (25.12.1991) కొద్ది కాలం ముందుగా(22.11.1990)  నేను అడ్వొకేట్ గా నమోదై ఖమ్మం కోర్ట్ కు ప్రాక్టీసు కై వెళ్ళేవాడిని. నేలకొండపల్లి నుండి రోజు ఖమ్మం నుండి బస్సు లో వెళ్ళే వాడిని. బస్సు స్టాండ్ నుండి RICKSHAW లో కోర్ట్ కు వెళ్ళే వాడిని.  అప్పటికింకా ఖమ్మం రహదారుల పైన ఆటోలు తిరుగం మొదలు కాలేదు. RICKSHAW లో వెళుతుంటే మార్గ మధ్యంలో కొన్ని సార్లు న్యాయవాది శ్రీ పొట్ల మాధవరావు లాంటి వాళ్ళు  RICKSHAW ను ఆపి వాళ్ళ కారులో బలవంతంగా ఎక్కిన్చుకొనే వాళ్ళు.

రాను రాను ఆర్ధిక ఇబ్బందు ఎక్కువై , ఖమ్మం వెళ్ళటానికి బస్సు చార్జెస్ కుడా లేక కోర్ట్ కు వెళ్ళటం బంద్ చేశాను. కొంతమంది అడ్వకేట్ మిత్రులు "అడ్వకేట్ వృత్తి కంటే రాజకీయాలే బాగున్నావా" అని ప్రశ్నించే వారు. నవ్వి వురుకుండే వాడిని. నా ఆర్ధిక స్థితి గురించి చాలా మందికి లోతుగా తెలీదు. ఖమ్మంలో చాలా మంది మిత్రులు, సహా న్యాయవాదులు "పొలాలు కౌలుకు ఇచ్చారా " అని ప్రశ్నించేవారు. సమాధానం ఏమి చెప్పాలో తెలీక సతమత మయ్యేవాడిని. అడ్వకేట్ గా నమోదు కాకముందు కొందఱు మిత్రులు అనేవారు"వాసుదేవరావు ఏమిచేస్తున్నాడని అంటే ఏమిచెప్పాలో తెలియటం లేదనే "వారు. రాజకీయాలు వృత్తి కాదు. మరేమీ చెప్పాలో తెలీదు. తరువాత నేను అందరికి నేను అడ్వకేట్ ను అని చెప్పగలిగే పరిస్థితి వచ్చింది.

పై రాజకీయ సంఘటనల తరువాత తప్పనిసరిగా రాజకీయ ఒంటరి పోరాటమే చేయవలసి వచ్చింది. నన్ను నమ్ముకుని వున్న వ్యక్తులను వీడిపోలేక దశల వారీగా వారికి ధూరం కావాలని నిర్ణ యించాను.

దాని ఫలితమే మళ్ళి శ్రీ సంభాని చంద్రశేఖర్ కు దగ్గరైనట్లు నటించాను. ఫలితంగా ముఖ్య మైన కార్యకర్తలు నాకు దూరము అయ్యారు. సంభానికి నేను దగ్గరైనా అతను నాకు ఇచ్చిన గౌరవ మర్యాద లేమి లేకపోగా అవమానాలు కుడా జరిగాయి. ఎవ్వరి కారణం వల్ల నేను జలగంకు దురంగా జరిగానో వాళ్ళే మళ్ళీ శ్రీ సంభానికి  చేరువ అయినారు. శ్రీ నాగుబండి లక్ష్మినారాయణ & కో..  జలగంను వీడి సంభాని దగ్గరకు వచ్చారు. 1994 సంవత్సరంలో పాలేరు షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి అదే సంవత్సరం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ సంభాని చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా పనిచేసినాము. నన్ను చూసి నియోజక వర్గంలో ముఖ్యులు చాలామంది అతనికి వ్యతిరేకంగా బహిరంగంగా వచ్చారు. CPM అభ్యర్ధి శ్రీ సండ్ర వెంకటవీరయ్య గెలుపుకు తోడ్పడ్డాము.

ఫలితంగా 1995 సంవత్సరంలో వచ్చిన గ్రామపంచాయత్ ఎన్నికలు మరియు సహకార ఎన్నికలలో ఇండిపెండెంట్ గానే పోటీ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఇండిపెండెంట్ గా వుండి  పోవలసి వచ్చింది.

                                                                                         -----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>




Billion reasons why the India-Israel partnership is hitting new highs.

#Geopolitics Modi's Diplomatic Dance: Navigating the Geopolitical Tightrope on His Israel Tour IN THE ABOVE PIC INDIAN PM SRI NARENDRA M...